Nani-Srikanth Odela: సోషల్ మీడియా వచ్చాక గంట గంటకి ఒక వార్త వచ్చి జనాలని కన్ఫ్యూజ్ చేస్తోంది. ముఖ్యంగా, రాజకీయాలకి.. సినిమాలకి సంబందించి వస్తున్న వార్తల్లో సగానికి సగం ఫేక్ న్యూస్, రూమర్సే ఉంటున్నాయి. ఒక వార్త వచ్చి వైరల్ అయ్యే లోపే..దానికి సంబందించిన వారు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. వ్యూస్ కోసమో..ఫాలోయింగ్ కోసమో ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం ఒకరకంగా జనాలను తప్పుదోవ పట్టించడమే.
ఈ మధ్య సినిమాల నుంచి చాలా వరకూ ఫేక్ న్యూసే వస్తున్నాయి. డీప్ ఫేక్ వీడియోస్ అని, ఇమేజస్ అని సెలబ్రిటీస్ ని కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ ఇలా సోషల్ మీడియాలో ఫేక్ రాయుళ్ళ బారిన పడి కోర్టు వరకూ వెళ్ళాల్సి వస్తోంది. దీనికి, ఎవరూ అతీతులు కాదు. ఇక, సినిమా రిలీజ్ డేట్ విషయంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.
నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా విషయంలో కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ వచ్చి వైరల్ అయింది. ఒకటి, రెండు సినిమాలు గ్రాఫిక్స్ వర్క్ కాక రెడు మూడు సార్లు వాయిదా పడితే, అది మిగతా సినిమాలకి అంటగట్టి నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇటీవలే, నాని ప్యారడైజ్ సినిమాను ఈ నెల సెప్టెంబర్ 24న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించి పోస్టర్ కూడా వదిలారు. అయినా, వీళ్లని ఫేక్ న్యూస్ రాసే వాళ్ళు వదల్లేదు.
ప్యారడైజ్ సినిమా వీఎఫెక్స్ వర్క్ కంప్లీట్ అవకపోవడంతో ఓ వారం వాయిదా పడిందని దాదాపు అన్నీ మీడియా ఛానళ్ళలో వార్తలు ప్రసారం అయ్యాయి. ఆ తర్వాత అక్టోబర్ 1న రిలీజ్ ఉండొచ్చునని కూడా రాసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంటే, ఆ సినిమాకి పోటీగా వస్తుందని డిసైడ్ చేశారు. ఇవన్నీ చూసిన ఫిల్మ్ మేకర్స్ తాజాగా ఎక్స్ ద్వారా తమ ప్యారడైజ్ సినిమా ముందు అనుకున్న తేదీ(సెప్టెంబర్ 24) నే రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో, మరోసారి ఫేక్ న్యూస్ కి చెక్ పెట్టారు.












