Fire Self: మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్లో కలకలం చెలరేగింది. ఓ యువకుడు పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తూ ఆ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్లో యువకుడి ఆత్మహత్యాయత్నం ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రామాయంపేట పోలీసులు, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితుడిని దుర్గాప్రసాద్ గా(28) గుర్తించారు. ప్రేమ పేరుతో ఓ యువతిని వేధిస్తున్నాడనే ఆరోపణలపై రామాయంపేట పోలీస్ స్టేషన్లో దుర్గాప్రసాద్ పై కేసు నమోదైంది.
అయితే, ప్రేమ వ్యవహారంలో పోలీసులు తనపై తప్పు కేసు పెట్టారని ఆరోపిస్తూ.. దుర్గాప్రసాద్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం సాయంత్రం పెట్రోల్తో పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలను గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దుర్గాప్రసాద్ ను పోలీసులు రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అతడికి చికిత్స అందిస్తున్నారు. 90శాతం కాలిన గాయాలతో దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.










