TG: ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలానికి చెందిన రాయల శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా కల్యాణ్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
కల్యాణ్ సుమారు 54 మంది నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో నమ్మించి దాదాపు రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల నుంచి తీసుకున్న మొత్తాలను ఉద్యోగాల కోసం యూజ్ చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించినట్లు బాధితుడు తన ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
అంతేకాకుండా బెట్టింగ్కు అలవాటు పడిన కల్యాణ్.. అందులో భారీగా డబ్బు కోల్పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు, బాధితుల నుంచి సేకరించిన మొత్తాలు, ఉద్యోగాల పేరుతో ఇచ్చిన హామీలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.







