AP: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డీఎస్సీపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని శాప్ ఎండీ భరణి అన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో ఎలాంటి తప్పులకు తావులేకుండా నిబంధనల ప్రకారమే ఎంపిక చేపట్టినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియాతో కలిసి ఆమె ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూడో క్రీడకు సంబంధించి వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఆమె స్పష్టం చేశారు.
జూడో కోటాలో ఎంపికైన అభ్యర్థులపై దాఖలైన పిటిషన్ నేపథ్యంలో అన్ని ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. డీవోపీటీ సూచనలు, హైకోర్టు ఆదేశాల మేరకే ప్రక్రియను పూర్తి చేశామని, ఎలాంటి నిబంధనలను మార్చలేదని వెల్లడించారు. ఒకే టోర్నీలో పాల్గొన్న భార్యాభర్తలను కూడా నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. పోటీల్లో పాల్గొనాలంటే తప్పనిసరిగా అదే ప్రాంతంలో చదువుకోవాలనే నిబంధన లేదని వివరించారు.
కర్ణాటకలో చదువుతున్న వారు సైతం ఏపీ నిర్వహించే పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. అయితే జిల్లాస్థాయి పోటీలకు సంబంధించిన ధ్రువీకరణను ఆయా క్రీడా సంఘాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏపీకి బాక్సింగ్లో గుర్తింపు తీసుకొచ్చిన అప్పలరాజుపైనా, కొనద పద్మజ వయసుకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని భరణి చెప్పారు. మెగా డీఎస్సీ ప్రక్రియపై వస్తున్న ప్రతి కంప్లైంట్ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.
మరోవైపు పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. టెట్ అర్హతకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఒకసారి టెట్ (TET) క్వాలిఫై అయితే జీవితాంతం అది చెల్లుబాటు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు అర్హత మార్కులు వేర్వేరుగా ఉంటాయని చెప్పారు. డీఎస్సీ ఎంపికలో టెట్కు 20 శాతం వెయిటేజ్ ఉంటుందని వెల్లడించారు. 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు కూడా ఈ రూల్ తప్పకుండా వర్తిస్తుందని చెప్పారు. అయితే పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు టెట్ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. అభ్యర్థులపై వస్తున్న ఆరోపణలను పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు.











