భారత ప్రధాని నరేంద్రమోడీ రేపటి నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. జులై 6 నుంచి 11 వరకు ఈ టూర్ కొనసాగనుంది. ముందుగా ఇండోనేషియా ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో పర్యటిస్తారని సమాచారం. మూడు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ప్రాంతీయ సహకారంపై చర్చల కోసం ప్రధాని పర్యటన ఉంటుందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇదిలాఉంటే.. భారత ప్రధాని ఆస్ట్రేలియాకు వస్తే..చంపుతామంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు స్థానిక మీడియా తెలిపింది. విదేశీ పర్యటనలో భాగంగా జులై 8న ప్రధాని మోడీ ఆస్ట్రేలియా చేరుకుంటారు. జులై 9న అక్కడ జరిగే ‘మెల్బోర్న్ మీట్స్ మోడీ’ ప్రొగ్రాంలో పాల్గొంటారు. ఈవెంట్కు సంబంధించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కింద ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి బెదిరిస్తూ కామెంట్లు పెట్టాడు. దీంతో ఆ పోస్టుకు సంబంధించిన ఐపీ అడ్రస్ను గుర్తించిన పోలీసులు విచారణ వేగవంతం చేసినట్టు సమాచారం. మోడీ కార్యక్రమానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలుస్తోంది.












