నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకివెళితే..నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జాతీయ రహదారిపై హైదరాబాద్ వెళ్తున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 8 ఏళ్ల బాలుడు సహా నలుగురు మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. కారును వెనుక నుంచి బస్సు ఢీకొన్న ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది.మృతులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంపై చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
కాగా, ఈ ప్రమాదంపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్స్ వేదిగా స్పందించారు. ‘నల్లగొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదానికి గురిచేసింది.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.ప్రమాదానికి గల కారణాలపై స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. ఘటనపై పూర్తి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు, క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించాను’ అని రాసుకొచ్చారు.












