ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ టు పొలిటీషియన్
బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ విజయం
ఇది జెన్జీ తీర్పా.. బీజేపీకి హెచ్చరికనా..?
దేశ రాజకీయాల్లో సరికత్త చర్చ
బిహార్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. బీజేపీకి కంచుకోటలా భావించే బాంకీపూర్ ఉపఎన్నిక రిజల్ట్ దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. పాట్నా నగరంలోని ఈ నియోజకవర్గంలో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం సెన్సెషన్గా మారింది. ఇది కేవలం ఒక ఎమ్మెల్యే సీటు గెలవడం మాత్రమే కాదు. బిహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలికే పరిణామంగా విశ్లేషకులు చూస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ మూడు దశాబ్దాల ఆధిపత్యానికి బ్రేక్ పడిందని తాజా ఫలితాలు సూచిస్తున్నాయి.
ప్రశాంత్ కిషోర్కు ఇది ఎందుకు కీలకం?
ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ అంటే ఎన్నికల వ్యూహకర్త అనే పేరే ఎక్కువ. మోదీ నుంచి మమతా బెనర్జీ వరకు, జగన్ నుంచి స్టాలిన్ వరకు అనేక మంది నేతలకు వ్యూహాలు రూపొందించిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఆయనకు ఇది తొలి పెద్ద విజయం. అంటే ఇకపై ఆయన కేవలం వ్యూహకర్త కాదు.. ప్రజలతో గెలిచిన నాయకుడు కూడా అనే ముద్ర పడింది.
ఇది జెన్ జీ విజయం అనొచ్చా?
ఈ ప్రశ్నకు పూర్తిగా అవును అని చెప్పడం కాస్త తొందరపాటు అవుతుంది. కానీ యువత ప్రభావం గణనీయంగా కనిపించిందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా విద్య, ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత వంటి అంశాలపై యువత ఆందోళనలు పెరిగాయి. ఈ అసంతృప్తిని ప్రశాంత్ కిషోర్ తన ప్రచారంలో ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఎన్నికల అనంతరం కూడా జెన్ జీ ఉద్యమాలు తన విజయానికి కొంతవరకు దోహదపడి ఉండొచ్చని ఆయనే వ్యాఖ్యానించారు.
అయితే బాంకీపూర్ ఫలితాన్ని పూర్తిగా జెన్ జీ ఓటుతోనే ముడిపెట్టడం సరైన విశ్లేషణ కాదు. స్థానికంగా ఉన్న అసంతృప్తి, అభ్యర్థి ఇమేజ్, సంస్థాగత ప్రచారం, బీజేపీ వ్యతిరేక ఓటు సమీకరణం వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపి ఉండొచ్చు.
బీజేపీకి ఇది హెచ్చరికేనా?
ఒక నియోజకవర్గం ఫలితంతో మొత్తం రాజకీయ పరిస్థితిని అంచనా వేయడం కష్టం. అయినప్పటికీ కొన్ని సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ బలమైన కోటగా భావించిన ప్రాంతంలో ఓటమి పార్టీకి ఎదురుదెబ్బే. కొత్త పార్టీ అయిన జన్సురాజ్కు ప్రజలు అవకాశం ఇవ్వడమంటే ఆషామాషీ కాదు. ఈ ఎన్నిక ద్వారా.. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నామనే సంకేతాన్ని ఓటర్లు ఇచ్చినట్టే.
బిహార్ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా?
ఇదే అసలు ప్రశ్న. బాంకీపూర్ విజయం తర్వాత జనసురాజ్ పార్టీపై దృష్టి మరింత పెరగడం ఖాయం. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మరింత దూకుడుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే ఒక ఉపఎన్నిక ఫలితం, సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో పునరావృతమవుతుందని చెప్పలేం. అసెంబ్లీ ఎన్నికల్లో కుల సమీకరణాలు, కూటములు, స్థానిక నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు పెద్ద పాత్ర పోషిస్తాయి.
కాంగ్రెస్, ఆర్జేడీకి కూడా సందేశమేనా?
ఈ ఎన్నికలో ప్రధాన పోటీ బీజేపీ-జనసురాజ్ మధ్యే కనిపించింది. సంప్రదాయ ప్రతిపక్షాల ప్రభావం తగ్గిందనే చర్చ కూడా మొదలైంది. అంటే బిహార్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఇకపై కేవలం ఆర్జేడీ మాత్రమే కాదు.. ప్రశాంత్ కిషోర్ కూడా ఎదుగుతున్న శక్తిగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం బలపడుతోంది.
బాంకీపూర్ ఫలితం ఒక్క ఎమ్మెల్యే గెలుపు కంటే చాలా పెద్ద రాజకీయ సందేశాన్ని ఇస్తోంది. ఇది ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రయాణానికి కీలక మలుపు. యువత, మధ్యతరగతి, మార్పు కోరుకునే ఓటర్లలో ఆయనకు ఆదరణ పెరుగుతోందనే సంకేతంగా కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే దీనిని "జెన్ జీ విప్లవం" అని ఇప్పుడే ప్రకటించడం కూడా తొందరపాటు అవుతుంది.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. బాంకీపూర్ ఫలితం బిహార్ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ను ఇకపై ఏ పార్టీ కూడా తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఆయన ప్రయాణం కూడా బిహార్తోనే ఆగుతుందని చెప్పలేం. రేపు రేపు సీజేపీ, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలతో కలిసి జాతీయస్థాయిలో ఓ ప్రత్యామ్నాయ శక్తిగా తయారయ్యే అవకాశమూ లేకపోలేదు.












