రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతా అంబానీకి మరో అరుదైన గౌరవం దక్కింది.ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన 'మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్' జాబితాలో ఆమె అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.రిలయన్స్ ఇండస్ట్రీ ద్వారా దేశంలో అనేక వ్యాపారాలు, సేవారంగాలను నడుపుతున్నారు. ఫలితంగా ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది. దీనికి తోడు ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, ట్రస్టులు కూడా నడుస్తున్నాయి. దేశవిదేశాల్లో రిలయన్స్ కంపెనీ తనసేవలను విస్తరిస్తూ వెళ్తున్నది.
ఇటీవలి కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో రిలయన్స్ అనేక ప్రాజెక్టులను చేపడుతోంది. అందులో మౌలిక సదుపాయాల కల్పన, ఎనర్జీ, విద్య, వైద్యరంగాలకు తగిన ప్రాధాన్యతను కల్పిస్తున్నారు. ఇలా రిలయన్స్ సంస్థ ద్వారా చాలా మంది ప్రయోజనం పొందుతున్నారు. వాటన్నింటిని ముందుండి నడిపిస్తున్నందున రిలయన్స్ చైర్ పర్సన్ నీతా అంబానీకి ఫార్ఛూన్ ఇండియా పవర్ ఫుల్ మహిళల జాబితాలో అగ్రస్థానం కట్టబెట్టింది.
దీనికితోడు సంస్థాగత నిర్మాణం, సమగ్ర వృద్ధి, సామాజిక సేవలో ఆమె చూపిన లీడర్షిప్కు గాను ఈ గౌరవం లభించింది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, క్రీడలు, మహిళా సాధికారత వంటి రంగాల్లో దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా ప్రజల జీవితాలపై ఆమె ప్రభావం చూపించినట్టు తెలిసింది. అందులో 2.9 కోట్ల మంది పిల్లలు ఉన్నట్లు రిలయన్స్ వెల్లడించింది.
ఇదే సమయంలో అమెరికాలోని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) ఆమెకు ప్రతిష్ఠాత్మక హ్యుమానిటేరియన్ అవార్డును ప్రదానం చేసింది. ఆరోగ్యం, విద్య, క్రీడలు, సంస్కృతి, సమాజాభివృద్ధి రంగాల్లో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేసింది. ఫ్లోరిడాలోని టాంపా నగరం అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటైన 'కీ టు ది సిటీ ఆఫ్ టాంపా'ను కూడా నీతా అంబానీకి అందజేశారు.ప్రస్తుత సమాజంలో సామాజిక మార్పు, మానవతా సేవల్లో ఆమె చేసిన కృషికి ఇది అంతర్జాతీయ స్థాయిలో లభించిన మరో ముఖ్యమైన గుర్తింపుగా చెప్పవచ్చు.












