నేటి నుంచే ఓటు గేమ్..
తెలంగాణ రాజకీయాల్లో కొత్త టెన్షన్!
గ్రామాల్లో గ్రామ సభలు.. పట్టణాల్లో వార్డు సభలు
ఓటరు జాబితాను చదివి వినిపించనున్న అధికారులు
తెలంగాణలో నేటి నుంచే ఓటర్ల లెక్కలు మరోసారి తెరపైకి రాబోతున్నాయి. మరికొద్ది గంటల్లో ప్రత్యేక ఓటర్ సభలకు తెరలేవనుంది. గ్రామాల్లో గ్రామసభలు.. పట్టణాల్లో వార్డు సభలు.. పోలింగ్ బూత్ల పరిధిలో ఓటర్ల జాబితాను ప్రజల ముందే చదివి వినిపించనున్నారు. పైకి చూస్తే ఇది సాధారణ ఎన్నికల ప్రక్రియలా కనిపించొచ్చు. కానీ తెలంగాణ రాజకీయాలను గమనిస్తే.. ఇది అంతకంటే పెద్ద విషయం.
ఎందుకంటే ఇప్పుడు చర్చ కేవలం నా పేరు ఓటర్ లిస్టులో ఉందా? అన్నదే కాదు. ఎవరి పేరు ఉంది? ఎవరి పేరు లేదు? ఎవరిని ఎందుకు గుర్తించారు? ఎవరిని ఎందుకు తొలగించారు? అన్న ప్రశ్నలు కూడా రాజకీయంగా మారే అవకాశం ఉంది.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఆగస్టు 17న తెలంగాణలో డ్రాఫ్ట్ ఓటర్ రోల్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకునే కీలక దశ మొదలవుతోంది. ఇవాళ జరిగే గ్రామ, వార్డు సభల్లో బూత్ లెవల్ అధికారులు డ్రాఫ్ట్ జాబితాలోని ఓటర్ల పేర్లను చదివి వినిపిస్తారు. జాబితాలో లేని అర్హులైన వారి వివరాలను కూడా గుర్తించనున్నారు.
అసలు పొలిటికల్ ట్విస్ట్ మొదలు...
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. మూడు ప్రధాన రాజకీయ శక్తులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తమ తమ రాజకీయ లెక్కలు వేసుకుంటున్నాయి. అలాంటప్పుడు ఓటర్ లిస్ట్లో జరిగే ప్రతి మార్పు పార్టీలకు కీలకమే. ఒక నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు తగ్గినా.. మరికొన్ని వేల ఓట్లు కొత్తగా చేరినా.. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం ఉండొచ్చు. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీల దృష్టి కూడా బూత్ల వైపు మళ్లుతోంది.
ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో ఈ ఓటర్ లిస్ట్ సవరణ మరింత ఆసక్తికరంగా మారింది. “నో మ్యాపింగ్” కేటగిరీలో ఉన్న 5,80,908 మంది ఓటర్లతో పాటు సరైన డేటా లేని మరో 6,72,678 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 12 లక్షలకు పైగా ఓటర్ల వ్యవహారం పరిశీలనలోకి రానుంది. ఇలాంటి కేసుల్లో సంబంధిత ఓటర్లు ఒరిజినల్ డాక్యుమెంట్లతో అధికారుల ముందు హాజరుకావాల్సిన పరిస్థితి కూడా ఉంది.
హైదరాబాదే కీలకం...
ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్ల వివరాల్లో మార్పులు, పరిశీలనలు జరిగితే.. నగరంలోని నియోజకవర్గాల ఓటర్ మ్యాథ్స్ ఎంతవరకు మారుతుంది? ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈ సవరణ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల లెక్కలు కూడా మారుతాయా? ఇదే ఇప్పుడు ఆసక్తికరం.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే యువత కూడా ఓటర్ లిస్ట్లో చేరేందుకు అవకాశం ఉంది. అంటే ఈ ప్రక్రియ కేవలం ఉన్న ఓటర్ల పేర్లను పరిశీలించడం మాత్రమే కాదు.. కొత్త ఓటర్లను కూడా రాజకీయ వ్యవస్థలోకి తీసుకొచ్చే ప్రక్రియ.
అంటే.. తెలంగాణలో 2028 ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా, ఓటర్ మ్యాథ్స్ మాత్రం ఇప్పటి నుంచే మొదలైనట్టే. కాంగ్రెస్కు అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి బూత్ కీలకం. బీఆర్ఎస్కు తిరిగి బలపడాలంటే తన పాత ఓటు బ్యాంకును కాపాడుకోవడంతో పాటు కొత్త ఓటర్లను ఆకర్షించాలి. బీజేపీకి అయితే తెలంగాణలో తన బేస్ను మరింత విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూడు పార్టీల రాజకీయ పోరులో.. చివరికి బూత్ దగ్గర పడే ఒక్కో ఓటే కీలకం.
అందుకే ఆగస్టు 27 కేవలం మరో తేదీ కాదు. నేటి నుంచే తెలంగాణలో ఓటు లెక్క మళ్లీ మొదలవుతోంది. గ్రామ సభలో చదివే ఒక్కో పేరు.. వార్డు సభలో కనిపించే ఒక్కో ఓటు.. భవిష్యత్ రాజకీయ లెక్కల్లో ఒక్కో సంఖ్యగా మారబోతోంది. ఇప్పటి వరకు నాయకులు సభల్లో మాట్లాడారు. ఇక నుంచి ఓటర్ల జాబితానే మాట్లాడబోతోంది.
మరి ఈ కొత్త ఓటర్ లెక్కలు ఎవరికి కలిసొస్తాయి? ఎవరికి షాక్ ఇస్తాయి? ఎవరి ఓటు బ్యాంకు బలపడుతుంది? ఎవరి రాజకీయ మ్యాథ్స్ మారుతుంది? అసలు తెలంగాణ రాజకీయాల నెక్స్ట్ గేమ్.. అనేది నేటి నుంచే మొదలవుతోంది.











