Nagarjuna: మీడియా ముందు మాట్లాడాలంటే భయమేస్తోంది! అంటూ సీనియర్ స్టార్ హీరో, అన్నపూర్ణ సంస్థ అధినేత, కింగ్ నాగార్జున అన్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఒక సినియర్ స్టార్ హీరో అయుండి..రాంగోపాల్ వర్మ, లారెన్స్, అనుష్క శెట్టి లాంటి ఎందరో నటీనటులను, దర్శకులను..ఇతర టెక్నీషియన్స్ ని తన సంస్థ ద్వారా పరిచయం చేసి..ఇప్పుడు మీడియా మీట్స్లో మాట్లాడటానికి భయపడుతున్నాడంటే కారణం ఎవరూ..?
అక్కినేని నాగార్జునకి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గొప్ప పేరుందో అందరికీ తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా ఒక మూలస్థంభం అని చెప్పాలి. ఆయన మరో నిర్మాత సూర్యదేవర నాగవంశీతో కలిసి లెనిన్ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాడు. తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా..భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. జూలై 10న భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రమోషన్స్ జరుపుతున్నారు. అయితే, లెనిన్ మూవీ ప్రెస్మీట్ లో నాగార్జున మీడియా గురించి చేసిన వ్యాఖ్యలు అటు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోను వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.."ఒకప్పుడు మేము ప్రెస్మీట్స్ పెడితే ఆరుగురు మాత్రమే మీడియావాళ్ళు ఉండేవారు. ఒక్క కెమెరా మేన్ వచ్చేవాడు. అప్పట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఎంతో ప్రశాంతంగా జరిగేవి. ఎంతో హుందాగా సమాధానం చెప్పేవాళ్లం.
కానీ, ఇప్పుడు ఒక సినిమా ప్రెస్మీట్ లో గానీ, ఈవెంట్స్లో గానీ మాట్లాడాలంటే భయమేస్తుంది. ఏది పొరపాటున మాట దొర్లినా దాన్నే పదే పదే చూపించి ట్రోల్స్ చేస్తున్నారు. అందుకే, ఒక్కో మాట ఎంతో జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుందన్నారు". నిజమే, ఒకప్పుటి కంటే ఇప్పుడు కొన్ని మీడియా ఛానళ్ళ అత్యుత్సాహం ఎక్కువైంది. ఇక యూట్యూబ్ ఛానల్స్ గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ఇది నాగార్జున ఒక్కరే ఫీలవడం లేదు. మిగతా వాళ్ళు ఇలాగే, ఫీలవుతున్నారు. ఇప్పటికైనా మీడియాలో కొందరు తమ వైఖరి మార్చుకుంటే బావుంటుందేమో.












