తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు నేడు (గురువారం) కీలక తీర్పు వెల్లడించనుంది. బాలికపై అకృత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదైన ఈ కేసులో ఆయన ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
తనకు క్రమం తప్పకుండా కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వీలుగా సాధారణ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ తన న్యాయవాదుల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా ఈ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా సాగాయి. నిందితుడి తరఫు న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తుకు భగీరథ్ పూర్తిగా సహకరిస్తున్నారని, ఆయనకు బెయిల్ ఇవ్వడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం లేదని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.
అయితే, ప్రభుత్వ తరఫు కౌన్సిల్, బాధితురాలి న్యాయవాదులు ఈ బెయిల్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. కేసు అత్యంత సున్నితమైనదని, నిందితుడు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, అందువల్ల బెయిల్ నిరాకరించాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు, పోలీసుల దర్యాప్తు నివేదికలను పూర్తిగా పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. గత విచారణలోనే తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ క్రమంలోనే గురువారం ఈ పిటిషన్పై తుది ఉత్తర్వులు వెలువరించనున్నట్లు కోర్టు కాజ్ లిస్ట్లో పేర్కొంది. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్కు హైకోర్టు ఉపశమనం కలిగిస్తుందా లేదా బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. దీనిపై అటు రాజకీయ వర్గాలతో పాటు న్యాయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.












