Mumbai Police: విద్యార్థులతో నోరు జారిన పోలీస్ అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. డ్రగ్స్ కేసులో ఇరికిస్తాను అంటూ బెదిరించి అడ్డంగా బుక్కైపోయాడు. చివరికి ఆ పోలీస్ పై వేటు పడింది. ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. అసలేం జరిగిందంటే..
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి మద్దతుగా ముంబైలో కొందరు విద్యార్థులు నిరసనలకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరిని వాహనంలోకి ఎక్కించారు. ఆ సమయంలో ఓ పోలీస్.. యువకులకు ఇచ్చిన వార్నింగ్ వివాదాస్పదంగా మారింది.
మరోసారి మీరు రోడ్ల మీద కనిపించినా, ఆందోళనల్లో పాల్గొన్నా మిమ్మల్ని డ్రగ్స్ కేసులో ఇరికిస్తా. మీ బ్యాగుల్లో 50 గ్రాముల చొప్పున డ్రగ్స్ వేస్తా. అంతే, ఇక మీ జీవితం మటాష్. బెయిల్ కూడా రాదు అని హెచ్చరించాడు. అంతేకాదు మీ వల్ల మేము బాధపడుతున్నామని అతడు చెప్పాడు. ఆ పోలీస్ వ్యాఖ్యలను వెహికల్ లో ఉన్న విద్యార్థుల్లో ఒకరు మొత్తం రికార్డ్ చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అంతే, ఒక్కసారిగా అది వైరల్ అయిపోయింది.
డ్రగ్స్ కేసులో ఇరికిస్తాను అంటూ పోలీస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆ పోలీస్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. అతడిపై వేటు వేశారు. ముంబై పోలీస్ శాఖ అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణకు కూడా ఆదేశించింది.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి...












