తెలంగాణలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా రంగంలోకి దిగిన 'హైడ్రా' (HYDRAA) కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సికింద్రాబాద్ లోతుకుంటలోని ఆర్మీ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారం సాయంత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ముందు హాజరయ్యారు. అధికారుల తీరుపై తీవ్రంగా మందలించిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపై తమకు నమ్మకం పోయిందని వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోసారి ఆర్మీ భూముల్లోకి ప్రవేశిస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఇతర అధికారులను అరెస్ట్ చేసి, వారి చేతులకు సంకెళ్లు వేసి తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్మీ అధికారులకు హైకోర్టు స్పష్టమైన సూచనలు చేసింది. ఒకవేళ హైడ్రా కానీ, స్థానిక పోలీసులు కానీ మళ్లీ ఆ స్థలాల జోలికి వస్తే వెంటనే తమకు తెలియజేయాలని ఆదేశించింది. సైనిక భూముల పరిరక్షణ విషయంలో అధికారులు సరిహద్దు దాటి ప్రవర్తించడంపై న్యాయస్థానం ఈ తీవ్రమైన ఆదేశాలను జారీ చేసింది.
మరోవైపు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వివాదంలోనూ హైడ్రా వైఖరి చర్చనీయాంశంగా మారింది. సదరు నిర్మాణ సంస్థకు చెందిన భూమి ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో లేదంటూ సంబంధిత రికార్డులను వారు కోర్టుకు సమర్పించారు. దీంతో మొదట్లో పెద్ద ఎత్తున హడావిడి చేసి, వార్తల్లో నిలిచిన హైడ్రా.. ఇప్పుడు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని పదేపదే కోరడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూలై 15వ తేదీ నుంచి కోర్టును గడువు కోరుతూ వస్తున్న హైడ్రా, తాజాగా కౌంటర్ కోసం మరో రెండు వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ప్రారంభంలో దూకుడుగా వ్యవహరించిన హైడ్రా, వరుస వివాదాలు, కోర్టు హెచ్చరికలతో ఇప్పుడు వెనకడుగు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ఆర్మీ భూముల విషయంలో హైకోర్టు చేసిన కఠిన వ్యాఖ్యలు, మరోవైపు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయలేక సమయం కోరడం హైడ్రా పనితీరును, అధికారుల తొందరపాటు నిర్ణయాలను ప్రశ్నార్థకం చేస్తోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












