నీట్ పరీక్షల లీకేజి వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపద్యంలో తెలంగాణలో జూలై 24న రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. లీకేజి వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీలో జరిగిన లాఠీచార్జ్ను ఖండిస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి.
ఈ బంద్కు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యూ మొదలగు విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ అంశం పై విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను రద్దు చేయాలని కోరారు. మరోవైపు ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన వాళ్ళను గుర్తించి.. పారదర్శక విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రతిపాదిత వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ (VBSA) విద్యా వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపిస్తూ ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు..
అలాగే విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని.. వారి నిరసన తెలిపే హక్కును అణచివేయరాదని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఈనెల 24వ తేదీన చేపట్టే బంద్కు రాష్ట్రంలోని విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశాయి.












