UPI Payments: యూపీఐ ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ పై ఛార్జీల వసూళ్ల బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే ''పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ 2007'' చట్ట సవరణ బిల్లు లోక్ సభ లో పాస్ అయ్యింది. ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. అంటే, ఇకపై ఛార్జీల వసూళ్ల పూర్తి అధికారం బ్యాంకులకు ఇచ్చింది కేంద్రం. లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లును రాజ్యసభకు పంపింది. అక్కడ కూడా ఆమోదం తెలుపనుంది. అనంతరం రాష్ట్రపతి రాజముద్రతో ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి రానుంది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), ఇతర నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతుల ద్వారా జరిగే చెల్లింపులపై ఛార్జీలు విధించేందుకు బ్యాంకులు, ఇతర సేవా ప్రదాతలకు అధికారం కల్పించే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 సవరణ బిల్లును లోక్సభ గురువారం ఆమోదించింది. నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వసూలు చేయకుండా బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలను నిరోధించే ప్రస్తుత చట్టపరమైన నిబంధనను తొలగించాలని కోరుతోంది.
RTGS, NEFT ద్వారా చేసే రియల్-టైమ్ చెల్లింపులు సర్వీస్ ఛార్జ్ చెల్లించడం ద్వారా జరుగుతాయి. ఇప్పటివరకు UPI లావాదేవీలకు అటువంటి ఛార్జీల నుండి మినహాయింపు ఉంది. 'పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్'లో ప్రతిపాదించిన మార్పులు, మంగళవారం నాడు సభలో ప్రవేశపెట్టిన పన్నులకు సంబంధించిన సమగ్ర చట్టంలో ఒక భాగం. వాయిదా అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు లోక్ సభ తిరిగి సమావేశమైంది. ఈ బిల్లుకు వాయిస్ ఓటు ద్వారా ఆమోదం లభించింది.
సభ తిరిగి సమావేశమైన వెంటనే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 'పన్నులు ఇతర చట్టాల (సవరణ) బిల్లు, 2026'ను పరిశీలన నిమిత్తం ప్రవేశపెట్టారు. 'పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007', 'ఆదాయపు పన్ను చట్టం, 2025'లను, అలాగే 'ఆర్థిక చట్టం, 2026'ను మరింత సవరించడం ఈ బిల్లు ఉద్దేశ్యం.












