Janwada Farmhouse: తెలంగాణ పాలిటిక్స్లో తీవ్ర దుమారం రేపుతున్న జన్వాడ ఫాంహౌస్ వివాదం మరింత వేడెక్కింది. శనివారం ఉదయం కాంగ్రెస్ నాయకులు ఫాంహౌస్ను ముట్టడించేందుకు రెడీ అవుతున్న టైంలో, ఆ ఆస్తి అసలు యజమాని ప్రదీప్ రెడ్డి రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేశారు. ఫాంహౌస్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ కుట్రలతోనే తన వ్యక్తిగత ఆస్తిని వివాదాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు.
కేటీఆర్ నా చిన్ననాటి దోస్త్.. లీజుకు ఇచ్చింది నిజమే
మాజీ మంత్రి కేటీఆర్తో తనకున్న సంబంధాలపై ప్రదీప్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. "జన్వాడ ఫాంహౌస్ నా కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తి. కేటీఆర్ నాకు చిన్ననాటి ఫ్రెండ్ కావడంతో, 2019లో దీనిని ఆయనకు లీజు ఇచ్చా. ఇందులో ఎలాంటి సీక్రెట్స్, అక్రమాలు లేవు. కేవలం కేటీఆర్తో తనకున్న సాన్నిహిత్యం కారణంగానే కొందరు ఉద్దేశపూర్వకంగా నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు" అని ఆయన వివరించారు.
అడుగుపెడితే ట్రెస్పాస్ కేసులు..
కాంగ్రెస్ శ్రేణులు చేపట్టబోయే ‘చలో ఫాంహౌస్’ కార్యక్రమంపై ప్రదీప్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి అనుమతి లేకుండా చొరబడాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెప్పారు. "ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నా ఫాంహౌస్పైకి దాడికి వస్తే తక్షణమే ట్రెస్పాస్ కేసులు పెట్టిస్తా. రాజకీయ లబ్ధి కోసం ఇతరుల ఆస్తులను లాగడం హేయమైన చర్య" అంటూ హెచ్చరించారు. ఫాంహౌస్ ముట్టడికి కాంగ్రెస్ సిద్ధమవుతుండటం, మరోవైపు యజమాని లీగల్ వార్నింగ్ ఇవ్వడంతో జన్వాడ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.











