Erravalli Land Survey: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు చెందిన ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లో ఏం జరుగుతోందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి పరిధిలోని ఫాంహౌస్ భూములపై రెవెన్యూ అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి విచారణ రెండో రోజు ముగిసింది. సరిహద్దు భూముల లెక్కలు తేల్చేందుకు అధికారులు స్పీడ్ పెంచడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
388 ఎకరాల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజపూర్ గ్రామాల సరిహద్దుల్లో ఉన్న సర్వే నెంబర్ 325లోని ఏకంగా 388 ఎకరాల భూమిపై అధికారులు ప్రధానంగా గురిపెట్టారు. గురువారం నాడే ఈ మూడు గ్రామాల సరిహద్దు ప్రాంతాలను గుర్తించి స్పష్టమైన మార్కింగ్ పూర్తి చేసిన అధికారులు, రెండో రోజు ఆ భూముల చరిత్రపై పూర్తిస్థాయిలో ఆరా తీశారు. అసలు గతంలో ఈ సర్వే నెంబర్ పరిధిలోని భూములు ఎవరి పేర్లపై ఉండేవి? ఆ రైతుల దగ్గర నుంచి చేతులు ఎలా మారాయి? ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో ఎవరి పేర్లు నమోదై ఉన్నాయి? అనే అంశాలపై లోతుగా వివరాలు సేకరించారు.
రంగంలోకి నాలుగు స్పెషల్ టీమ్స్ ..
ఈ సర్వే ప్రక్రియను అధికారులు ఏమాత్రం ఆషామాషీగా తీసుకోవడం లేదు. ఏడీ సుదర్శన్ రాథోడ్, డీఐ సేవియ నాయక్ నేతృత్వంలో ఏకంగా నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి భూమి కొలతలు, సరిహద్దుల నిర్ధారణను క్షుణ్ణంగా పూర్తి చేశాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన ముగియడంతో, సేకరించిన పత్రాలు, ప్రస్తుత రికార్డులను సరిపోల్చి అధికారులు పక్కా నివేదికను తయారు చేస్తున్నారు. త్వరలోనే ఈ రిపోర్టు ఉన్నతాధికారులకు చేరనుండటంతో, సర్వే నెంబర్ 325 పరిధిలో ఏం తేలబోతోంది? కేసీఆర్ ఫాంహౌస్ సరిహద్దుల్లో ఏదైనా తేడా బయటపడుతుందా? అన్నది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది.








