తెలంగాణ

Jagtial: తెలంగాణ పాలిటిక్స్‌లోకి మరో వారసురాలు ఎంట్రీ!

రచన: Venu8 నిమిషాల పఠనం

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఇక ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి గణనీయమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికి ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్థానికంగా ఏర్పడిన సంబంధాలు తోడైతే.. ఛరిష్మా రెడ్డికి బలమైన రాజకీయ పునాది ఏర్పడే అవకాశం ఉందనే ప్రచారం ఉంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలువురు నేతల కుటుంబాల్లో వారసత్వ రాజకీయాలపై చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో సీనియర్ రాజకీయ నాయకుడు జీవన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న జీవన్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి తెలంగాణ వరకు తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన.. అనేక కీలక పదవులు చేపట్టారు. అయితే ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రస్తుతం గులాబీ పార్టీలో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి కుటుంబం నుంచి మరో తరం రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఆయన చిన్న కోడలు ఛరిష్మా రెడ్డిని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.

జగిత్యాలలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్?

ఛరిష్మా రెడ్డి కొంతకాలంగా జగిత్యాల నియోజకవర్గంలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. మామ జీవన్ రెడ్డితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. స్థానిక నేతలు, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారనే టాక్ ఉంది. ఉన్నత విద్యావంతురాలిగా గుర్తింపు పొందిన ఆమె.. నియోజకవర్గంలోని వివిధ వర్గాలతో పరిచయాలు పెంచుకుంటున్నారనే చర్చ సాగుతోంది.

అదేవిధంగా కార్యకర్తల సమస్యలపై స్పందించడం, అనుచరులకు అండగా నిలవడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు కూడా ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థుల తరఫున ఛరిష్మా రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారని.. ఆమె మద్దతు ఇచ్చిన పలువురు అభ్యర్థులు విజయం సాధించారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆమె పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది..

క్యాడర్‌ను కాపాడుకోవడంలో కీలక పాత్ర?

జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత ఆయన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఒకే తాటిపై ఉంచడం కూడా కీలకంగా మారింది. ఈ విషయంలో ఛరిష్మా రెడ్డి చురుకుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. పాత అనుచరులతో సంబంధాలు కొనసాగించడం.. స్థానికంగా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం.. అవసరమైన సమయంలో వారికి మద్దతుగా నిలవడం వంటి అంశాలు ఆమెకు అనుకూలంగా మారుతున్నాయని తెలుస్తోంది.

కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా?

మరోవైపు రాబోయే ఎన్నికల్లో ఛరిష్మా రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ సానుకూలంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిన సమయంలోనే తన రాజకీయ అవకాశాలపై చర్చ జరిగిందని.. ఒక అసెంబ్లీ టికెట్ విషయంలో హామీ లభించిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే ఆ అవకాశం జీవన్ రెడ్డికా? లేక ఆయన కుటుంబం నుంచి మరో వ్యక్తికా? అన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం మాత్రం ఆ టికెట్ ఛరిష్మా రెడ్డికి దక్కవచ్చనే ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

జగిత్యాలలో మారనున్న సమీకరణాలు?

జగిత్యాల నియోజకవర్గం గతంలో కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతంగా ఉండేది. కాలక్రమేణా రాజకీయ పరిస్థితులు మారడంతో బీఆర్ఎస్ ఇక్కడ తన ప్రభావాన్ని పెంచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఇక ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి గణనీయమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికి ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, స్థానికంగా ఏర్పడిన సంబంధాలు తోడైతే.. ఛరిష్మా రెడ్డికి బలమైన రాజకీయ పునాది ఏర్పడే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. అలాగే కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచన కూడా బీఆర్ఎస్‌లో ఉంటే.. ఛరిష్మా రెడ్డి పేరు మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

2029 బరిలో ఛరిష్మానేనా?

2029 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ తరఫున ఎవరు బరిలో ఉంటారనే చర్చ మాత్రం ఇప్పటి నుంచే మొదలైంది. ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగినా.. ప్రస్తుత సీటింగ్ విధానమే కొనసాగినా.. జీవన్ రెడ్డి కుటుంబం నుంచి ఛరిష్మా రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. అయితే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం.

కాబట్టి పార్టీ వ్యూహాలు, నియోజకవర్గ సమీకరణాలు, అభ్యర్థుల ఎంపిక.. చివరి నిమిషంలో కూడా నిర్ణయాలను మార్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం వినిపిస్తున్నది కేవలం రాజకీయ వర్గాల చర్చ మాత్రమేనా? లేక జీవన్ రెడ్డి తన తర్వాతి రాజకీయ అధ్యాయాన్ని ఛరిష్మా రెడ్డితో ప్రారంభించేందుకు ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

#Telangana#politics#Jagtial#brs#charishma-reddy#jeevan-reddy#daughter-in-law
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి