TG: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అనుచిత కామెంట్స్ చేశారన్న కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. వీరిని రిమాండ్కు పంపాలన్న పోలీసుల అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
రూ.10 వేల చొప్పున పూచీకత్తుతో పాటు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని సూచించింది. స్పీకర్ను కులం పేరుతో దూషించడంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగించారంటూ స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు వారిద్దరిపై కేసు నమోదైంది.
ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు ఉదయం పోలీసులు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం వారి రిమాండ్ను తిరస్కరిస్తూ న్యాయస్థానం బెయిల్ తరహా వ్యక్తిగత పూచీకత్తుపై రిలీజ్కి ఆదేశించింది.
ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యవహారం శాసనసభలోనూ ప్రస్తావనకు వచ్చింది. తాతా మధు, నవీన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్పై చేసిన కామెంట్స్ ఒక్క వ్యక్తిని అవమానించడం కాదని, యావత్ శాసనసభకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్పీకర్పై ఉపయోగించిన భాష ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.








