Tollywood vs Kollywood : సినిమాకు భాషా సరిహద్దులు ఉండవని ఎప్పటి నుంచో చెబుతుంటారు. మంచి కథ, బలమైన నటన, ఆకట్టుకునే మేకింగ్ ఉంటే ఏ ప్రాంతం ప్రేక్షకులైనా ఆదరిస్తారనేది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తమిళ హీరోలకు లభిస్తున్న క్రేజ్ చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కోలీవుడ్కు చెందిన పలువురు స్టార్ హీరోలు తమ సొంత మార్కెట్తో పాటు టాలీవుడ్లోనూ అదిరిపోయే వసూళ్లు సాధిస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలకు సరిపడా థియేటర్లు దక్కడం, అభిమానుల నుంచి ఆ మూవీస్కి అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఇప్పుడు చాలా కామన్గా అయ్యింది.
తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ లభించడంతో పాటు కలెక్షన్స్ పరంగా కూడా సత్తా చాటినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది. సూర్యకు ఇక్కడ ఉన్న ఫాలోయింగ్ మరోసారి తెరపై స్పష్టంగా కనిపించదని చెబుతున్నారు.
ఆ తర్వాత ఆయన నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విషయంలోనూ తెలుగు మార్కెట్పై ఆసక్తికరమైన చర్చ జరిగింది. తమిళనాడుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లు సాధించిందనే ప్రచారం సినీ వర్గాల్లో సాగింది. దీంతో కోలీవుడ్ హీరోలకు టాలీవుడ్ మార్కెట్ ఎంత కీలకంగా మారిందో అర్థమవుతోంది.
ఇప్పుడు సూర్య తమ్ముడు కార్తీ కూడా ‘సర్దార్ 2’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సర్దార్’కు సీక్వెల్గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదలకు సిద్ధమైంది. గతంలో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ తెలుగులో మంచి ఆదరణ దక్కడంతో ఈ సీక్వెల్పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కార్తీకి తెలుగు ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధం ఉండటం ఈ చిత్రానికి అదనపు బలంగా మారనుంది.
అయితే ఈ పరిణామాల మధ్య మరో ప్రశ్న తెరపైకి వస్తోంది. తమిళ హీరోలు తెలుగు రాష్ట్రాల్లో తమ సినిమాలను ఇంత సులభంగా మార్కెట్ చేసుకోగలుగుతున్నప్పుడు.. తెలుగు హీరోలకు తమిళనాడులో అదే స్థాయిలో పరిస్థితులు ఉన్నాయా?
తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నప్పటికీ, తమిళ మార్కెట్ విషయంలో మాత్రం ప్రతిసారీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనే అభిప్రాయం కామన్ ఆడియన్స్ నుంచి సినిమా విశ్లేషకుల వరకు ఉంది. ఇటీవల ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా చిత్రాల పరిస్థితితో పాటు గతంలో విడుదలైన కొన్ని తెలుగు భారీ చిత్రాలను పరిశీలిస్తే ఈ వ్యత్యాసం స్పష్టం కనిపిస్తోందని అంటున్నారు.
ఇదే విషయంపై హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలుగు ప్రేక్షకులు, సినీ పెద్దలు ఇతర భాషల సినిమాలకు ఇస్తున్న స్థాయిలో తమిళనాడులో తెలుగు చిత్రాలకు అదే తరహా ప్రోత్సాహం లభించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో తెలుగు సినిమాలకు కనీసం థియేటర్లు కేటాయించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
తన ‘క’ సినిమా విడుదల సమయంలో, అలాగే ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా సమయంలో ఇలాంటి సమస్యలను స్వయంగా ఎదుర్కొన్నట్లు కిరణ్ అబ్బవరం వెల్లడించారు. దీంతో తెలుగు–తమిళ సినీ మార్కెట్ల మధ్య ఉన్న వ్యత్యాసంపై మరోసారి చర్చ మొదలైంది.
అయితే ఈ పరిస్థితిని కేవలం ఒక పరిశ్రమ మరొక ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఉందనే కోణంలో చూడటం సరైనది కాదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ప్రతి ప్రాంతానికీ అక్కడి ప్రేక్షకుల అభిరుచులు, లోకల్ స్టార్ కాస్ట్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, థియేటర్ అవైలబిలిటీ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయనే వాదన వినిస్తోంది. తమిళ ప్రేక్షకులకు తెలుగు స్టార్ హీరోలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. అది ఇంకా కోలీవుడ్ హీరోలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్థాయిలో బలమైన మార్కెట్ స్థాయికి మారలేదనే కామెంట్స్ వినిస్తున్నాయి.
మరోవైపు టాలీవుడ్ కూడా తమిళ మార్కెట్ను మరింత బలంగా టార్గెట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. పాన్ ఇండియా అనే పదం కేవలం హిందీ మార్కెట్ లేదా కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాకుండా, దక్షిణాది పరిశ్రమల మధ్య సమానమైన మార్కెట్ను సృష్టించినప్పుడే దాని అసలు అర్థం నెరవేరుతుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
మొత్తంగా చూస్తే.. తెలుగు ప్రేక్షకులు సూర్య, కార్తీ, అజిత్, విజయ్ వంటి తమిళ హీరోలను తమ హీరోల్లాగే ఆదరిస్తున్నప్పుడు.. తమిళ ప్రేక్షకులు తెలుగు హీరోలకు అదే స్థాయి అవకాశాలు ఇస్తున్నారా? అన్న ప్రశ్నకు భవిష్యత్ సినిమాల వసూళ్లు, థియేటర్ కేటాయింపులు, ప్రేక్షకుల రెస్పాన్స్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. రెండు పరిశ్రమల మధ్య హెల్తీ కాంపిటీషన్తో పాటు పరస్పర ఆదరణ పెరిగితే దాని ప్రయోజనం చివరకు ప్రేక్షకులకే దక్కుతుందని అంటున్నారు. చూడాలి మరి తెలుగులో తమిళ హీరోలకు దక్కుతున్న ఆదరణ కోలీవుడ్లో టాలీవుడ్ హీరోలకు ఎప్పుడు దక్కుతుందనేది









