Bhatti Vikramarka :తెలంగాణ అసెంబ్లీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ పరిసరాల్లో జరిగిన పరిణామాలు కాకతాళీయంగా చోటుచేసుకున్నవి కావని, ఫామ్హౌస్లో చేసిన కుట్రలో భాగమని ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను అవమానించడం ఒక వ్యక్తిని కించపరచడం కాదని, యావత్ శాసనసభను అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. స్పీకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలను భట్టి తీవ్రంగా ఖండించారు. ఇద్దరి ప్రవర్తన అత్యంత జుగుప్సాకరంగా ఉందని పేర్కొంటూ.. బీఆర్ఎస్ ఇంకా ఫ్యూడల్ ధోరణి నుంచి బయటపడలేదని విమర్శించారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వడం ప్రతి సభ్యుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు
ఈ వ్యవహారంలో తాతా మధు, నవీన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. మంత్రి దామోదర రాజనర్సింహ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మద్దతు తెలిపారు. అనంతరం సభ దానిని ఆమోదించి, ఇద్దరూ శాసనమండలి సభ్యులు కావడంతో తదుపరి చర్యల కోసం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి పంపింది. తీర్మానాన్ని పరిశీలించిన మండలి చైర్మన్.. తాతా మధు, నవీన్రెడ్డిలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాలంలో వారు మండలి సమావేశాలకు హాజరుకావడానికి వీలులేదని స్పష్టం చేశారు.
‘స్పీకర్ గౌరవాన్ని కాపాడాలి’
స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ దళిత వర్గం నుంచి ఎదిగి ఈ స్థాయికి వచ్చినప్పటికీ, ఆయనను కేవలం దళిత స్పీకర్గా చూడటం సరికాదని భట్టి అన్నారు. ఆయన యావత్ శాసనసభకు సభాపతి అని పేర్కొన్నారు. ఒకవైపు సభాపతి స్థానాన్ని అవమానించడం, మరోవైపు దళిత వర్గానికి చెందిన వ్యక్తిని కించపరిచేలా వ్యవహరించడం అనే రెండు కోణాల్లో ఈ ఘటనను చూడాల్సి ఉందని ఆయన వివరించారు. ఇక ఇద్దరు ఎమ్మెల్సీలపై తీసుకున్న చర్యలతో శాసనసభ, శాసనమండలిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.












