Flight Ticket Prices : దేశంలో వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, దుర్గాపూజ వంటి ఫెస్టివల్స్ రానుండటంతో విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు ముందుగానే బుకింగ్స్ చేసుకుంటుండటంతో పలు దేశీయ మార్గాల్లో టికెట్ ధరలు గణనీయంగా పెరిగాయి. సీట్లు తక్కువగా దొరకడం, పరిమిత విమానాలు, డైనమిక్ ప్రైసింగ్ కారణంగా కొన్ని రూట్లలో సాధారణ ఛార్జీలతో పోలిస్తే 50 నుంచి 150 శాతానికి పైగా రేట్లు పెరిగినట్లు తాజా ట్రావెల్ మార్కెట్ రికార్డ్లు సూచిస్తున్నాయి.
ఈ దీపావళి సమయంలో ఢిల్లీ–పాట్నా రూట్లో నార్మల్గా రూ.3,500–4,500గా ఉండే నాన్స్టాప్ ఎకానమీ టికెట్ ధర రూ.12,500 దాటింది. చివరి నిమిషంలో బుకింగ్ చేస్తే రూ.13,500కుపైగా చెల్లించాల్సి వస్తోంది. ప్రాంతీయ మార్గాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. దుర్గాపూజ సందర్భంగా కోల్కతా–దియోఘర్ టికెట్ ధర రూ.2,800 నుంచి రూ.12,500కు చేరినట్లు తెలుస్తోంది. ఢిల్లీ–అగట్టి రూట్లో రూ.8,500గా ఉన్న ఛార్జీ రూ.25,000కు, బెంగళూరు–ఝార్సుగూడలో రూ.4,200 నుంచి రూ.16,200కు పెరిగింది. ముంబై–బరేలీ, ముంబై–కోల్కతా మార్గాల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.
ఇక టికెట్ ధరల పెరుగుదలకు ఇంధన వ్యయాలు కూడా కారణమవుతున్నాయి. సెప్టెంబర్ 1న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధర 5.46 శాతం పెరిగి లీటరుకు రూ.121.28కు చేరింది. విమానాల నిర్వహణ, ఇంజిన్ సమస్యలు, కొత్త విమానాల డెలివరీలో లేట్ వంటి కారణాలు ఉండగా.. సర్వీస్ డిమాండ్ మాత్రం బలంగానే ఉంది. పండుగల రద్దీ తగ్గిన తర్వాతే విమాన చార్జీల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నాయి.








