సుదీర్ఘమైన 24 ఏళ్ల విరామం తర్వాత పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచకప్కు ఆఫ్రికా ఖండం మళ్లీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2027లో జరగబోయే ఈ ప్రతిష్ఠాత్మక మెగా టోర్నమెంట్ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో టోర్నీకి సంబంధించిన 12 క్రీడా మైదానాల వివరాలను, అధికారిక లోగో/బ్రాండ్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జొహన్నెస్బర్గ్లో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించింది. "త్రీ నేషన్స్, వన్ హార్ట్బీట్" అనే ప్రత్యేక నినాదంతో, ఆఫ్రికన్ సంస్కృతికి ప్రతీకగా నిలిచే 'ఉబుంటు' తత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ఈవెంట్ను డిజైన్ చేశారు.
ఈ ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికాలో 8, జింబాబ్వేలో 3, నమీబియాలో 1 వేదికను ఖరారు చేశారు. జొహన్నెస్బర్గ్ (వాండరర్స్), కేప్ టౌన్ (న్యూలాండ్స్), డర్బన్, సెంచూరియన్ వంటి ప్రముఖ దక్షిణాఫ్రికా స్టేడియాలతో పాటు జింబాబ్వేలోని హరారే, బులవాయో, విక్టోరియా ఫాల్స్ వేదికలుగా మ్యాచ్లు జరగనున్నాయి. నమీబియాలోని విండ్హోక్ మైదానం కూడా ఇందులో భాగమైంది. కాగా, నమీబియా ఒక పెద్ద ఐసీసీ గ్లోబల్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. గతంలో చివరిసారిగా 2003లో ఆఫ్రికన్ దేశాలు సంయుక్తంగా ప్రపంచకప్ను నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈసారి క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ఐసీసీ టోర్నమెంట్ విధానంలో మార్పులు చేసింది. మొత్తం 14 జట్లు పోటీపడే ఈ టోర్నీలో 57 మ్యాచ్లు ఉంటాయి. లోయర్ ర్యాంకింగ్ జట్ల మధ్య జరిగే 'సూపర్ సిరీస్'తో మొదలై, ఆ తర్వాత రెండు గ్రూపులుగా 12 జట్లు పోటీపడతాయి. అనంతరం 'సూపర్ 7' రౌండ్, ఆపై సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. పోటీతత్వాన్ని పెంచేందుకే ఈ మూడు దశల విధానాన్ని తీసుకొచ్చినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి.
ఆఫ్రికాలో క్రికెట్ పునరాగమనానికి ఇదొక చరిత్రాత్మక ఘట్టమని ఐసీసీ ఛైర్మన్ జై షా పేర్కొనగా, ఈ ఈవెంట్ ఆఫ్రికన్ క్రీడాభిమానుల ఉత్సాహాన్ని ప్రపంచానికి చాటుతుందని ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా తెలిపారు. బ్రాండింగ్ రూపకల్పనలో ఆఫ్రికన్ సంప్రదాయ రంగులను, వైర్ బౌల్ కళను ఉపయోగించారు. మాజీ, ప్రస్తుత దిగ్గజ ఆటగాళ్లు గ్రేమ్ స్మిత్, మఖాయా ఎన్తిని, హషీమ్ ఆమ్లా, టెంబా బావుమా పాల్గొన్న ఈ కార్యక్రమంలో టికెట్ల ముందస్తు సమాచారం కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించినట్లు ప్రకటించారు.
https://www.instagram.com/p/DbbI-QkklGH/?utm_source=ig_web_button_share_sheet












