Hydraa: దేశంలోని ప్రధాన నగరాలు ఇప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలను వరద ముప్పు భయపెడుతోంది. చిన్న పాటి వర్షం కురిసినా ఈ నగరాలు చిగురుటాకులా వణికిపోయే పరిస్థితి ఉంది. అర్బన్ ఫ్లడ్స్ ఇప్పుడు నగరవాసులను తీవ్రంగా భయపెడుతున్న అంశం. కాగా, నగరాల్లో నెలకొన్న ఈ దుస్థితిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నగరాలను వరదలు ముంచెత్తడానికి ప్రధాన కారణం చెరువులు లాంటి సహజ జల వనరులు కనుమరుగు కావడమే అని రంగనాథ్ తెలిపారు. నగరాల్లో మూడు నుంచి 4 సెంటీమీటర్ల వర్షం కురిసినా రోడ్లపైకి నీరు చేరుతోందన్నారు. చెరువులు ఆక్రమణకు గురి కావడమే ఈ సమస్యకు కారణం అన్నారు.
దేశంలోని అనేక నగరాల్లో చెరువులు కబ్జాకు గురై కనుమరుగైపోతున్నాయని.. ఢిల్లీలో కొన్ని చెరువులు పార్కింగ్ యార్డులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అర్బన్ ఎన్విరాన్ మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ జాతీయ సదస్సులో రంగనాథ్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు.
ఈ సదస్సులో హైడ్రా గురించి ప్రస్తావన తెచ్చారు రంగనాథ్. చెరువుల పరిరక్షణలో సమర్థవంతంగా పని చేస్తున్న హైడ్రాను అడ్డుకునేందుకు ల్యాండ్ మాఫియా కుట్రలు చేస్తోందన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ వాపోయారు. అన్ని అనుమతులు ఉన్న ఏ ఒక్క భవనాన్ని కూడా కూల్చే ప్రయత్నం జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులను చట్ట ప్రకారమే పరిరక్షిస్తున్నట్లు వెల్లడించారు. రెండేళ్లలో 3వేల 350 ఎకరాల కబ్జా భూమిని రక్షించామన్నారు. ఆ భూమి విలువ సుమారు 1.50 లక్షల కోట్లు ఉంటుందన్నారు. ఇక వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా హైడ్రా తరహా ఏజెన్సీ ఏర్పాటు కోసం ఆలోచన చేస్తోందని, ఆ విషయంలో తమను సంప్రదించిందని రంగనాథ్ తెలిపారు.












