Hyderabad: హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య చేసుకుంది. నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న యువతి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని అపరాజిత హాస్టల్ లో విషం తాగి సూసైడ్ చేసుకుంది. మృతురాలిని కర్నూలుకు చెందిన యశ్వితగా గుర్తించారు.
ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత 6 నెలలుగా హైదరాబాద్లో ఉంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలో శనివారం తీవ్ర నిర్ణయం తీసుకుంది. తాను ఉంటున్న రూమ్ లోనే బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. యశ్విత ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, పరీక్షల మానసిక ఒత్తిడే యువతి బలవన్మరణానికి కారణం అని అనుమానిస్తున్నారు.
యశ్వితను కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తెగా పోలీసులు గుర్తించారు. యశ్విత మృతితో ఆమె కుటుంబంలో పెను విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












