రాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. నిన్న ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సమయంలో మెయిన్ గేటు వద్ద జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ నేతలు పలువురి గాయాలు అయిన విషయం తెలిసిందే.మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లదుస్తులు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీలోనికి వెళ్లరాదని బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోగా.. ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆ కామెంట్స్కు గాను స్పీకర్ నిన్న శాసనసభలో కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిసింది.
ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ను అవమానించినందుకు ఎమ్మెల్సీ తాతా మధును మండలికి రాకుండా ఆయన సభ్యత్వాన్ని బర్తరఫ్ చేయాలని చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ తాతా మధు,నవీన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి తోడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా మరో 14 మంది నేతలపై పోలీసులు 5 కేసులు నమోదు చేసినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే సిద్దిపేటలోని ఎర్రవెల్లి కేసీఆర్ నివాసం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఉదయాన్నే పోలీసులు అక్కడకు పెద్దఎత్తున చేరుకున్నారు. కేసులు నమోదు చేసిన నేతలను అరెస్టు చేయనున్నారని తెలుస్తోంది. కాగా, ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని బీఆర్ఎస్ పార్టీ త్రి లైన్ విప్ జారీ చేసింది. బిల్లు, తీర్మానం, ఓటింగ్ ప్రక్రియలో పార్టీ విధానం ప్రకారమే వ్యవహరించాలని స్పష్టం చేసింది.ఎవరైనా విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వేస్తామని పార్టీ హెచ్చరించింది.
కాగా, నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలను అసెంబ్లీలోనికి వెళ్లకుండా అడ్డుకోరాదని హెచ్చరించింది.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టులపై కేటీఆర్ మండిపడ్డారు.అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారు.కాగా, బీఆర్ఎస్ నేతల అరెస్టు నేపథ్యంలో పోలీసులు ముందస్తు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.












