అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన తమ పార్టీ శాసనసభ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులకు ఆ అధికారం ఎక్కడిదని ప్రశ్నించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులను అలా ఎలా అడ్డుకుంటారని, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.రేవంత్ ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేసే హక్కు, హామీల అమలుపై నిలదీసే అధికారం ప్రతిపక్షాలకు ఉందని, ప్రజల కోసమే తాము పనిచేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.కాంగ్రెస్ హమీలు నెరవేర్చలేదని,అందుకే తాము నిరసన తెలిపామని అంటున్నారు.ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు గన్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపామని చెబుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను గుర్తుచేసేందుకు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చామని పేర్కొంటున్నారు.

నల్లదుస్తులు ధరించి అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం, అందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్నటి ఘటనపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అసెంబ్లీకి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నందుకు.. దీనిపై చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
పోలీసుల అమానుష ప్రవర్తనపై సభలో చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హక్కులకు భంగం కలిగించారంటూ బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది.పోలీసుల వ్యవహారశైలిపై సభలో చర్చించాలంటూ బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వగా.. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. ఇవాళ జరిగే సమావేశాల్లో నిన్నటి అంశంపై పెద్దఎత్తున బీఆర్ఎస్ నేతలు ఆందోళన తెలపనున్నట్టు సమాచారం.












