ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన పారిస్లోని ఈఫిల్ టవర్లో చోటుచేసుకున్న ఓ వివాదం ఇప్పుడు ఫ్రాన్స్లో తీవ్ర చర్చకు దారితీసింది. మహిళా సిబ్బంది పట్ల వివక్ష చూపారన్న ఆరోపణలతో ఉద్యోగులు నిరసనకు దిగడంతో సోమవారం ఈఫిల్ టవర్ సందర్శనను మూసివేయాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు దూసుకెళ్తున్న సమయంలో.. వారిపట్ల లింగవివక్ష చూపిస్తూ పక్కన పెట్టారన్న ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
పారిస్ సమీపంలో నిర్మించిన బోచాసణ్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆలయ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా ఆ సంస్థకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులు ఈఫిల్ టవర్ను సందర్శించారు. అయితే, ఈ పర్యటన సమయంలో మహిళా సిబ్బంది ప్రతినిధుల కంటికి కనిపించకుండా ఉండాలని, తమ విధుల్లోని కొన్ని ప్రాంతాల నుంచి తప్పుకోవాలని యాజమాన్యం ఆదేశించినట్లు కార్మిక సంఘాలు ఆరోపించాయి.
మహిళా ఉద్యోగుల స్థానంలో పురుష సిబ్బందిని నియమించారని, ప్రతినిధి బృందానికి పురుష ఉద్యోగులను మాత్రమే సహాయకులుగా కేటాయించారని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఈ చర్యపై సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఉద్యోగి మహిళ కావడం కారణంగా ఆమెను విధుల్లో నుంచి పక్కకు తప్పించడం లేదా కనిపించకుండా చేయడం సమానత్వ సూత్రాలకు విరుద్ధమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో సోమవారం ఈఫిల్ టవర్ సిబ్బంది నిరసనకు దిగారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కారణంగా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఒకటైన ఈఫిల్ టవర్ను రోజంతా మూసివేయాల్సి వచ్చింది. కాగా ఈ వివాదంపై ఈఫిల్ టవర్ను నిర్వహించే సొసైటీ డి'ఎక్స్ప్లాయిటేషన్ డి లా టూర్ ఈఫిల్ (ఎస్ఈటీఈ) స్పందించింది.
మహిళా సిబ్బంది తమకు దూరంగా ఉండేలా ప్రతినిధి బృందం కోరిన విషయం వాస్తవమేనని సంస్థ అంగీకరించింది. అయితే, అలాంటి షరతులను అంగీకరించి ఉండాల్సింది కాదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఉద్యోగులకు క్షమాపణలు చెప్పడంతో పాటు, పూర్తి స్థాయి విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. మరోవైపు ఈ ఘటనపై పారిస్ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ కూడా తీవ్రంగా స్పందించారు.
మహిళలు, పురుషుల మధ్య సమానత్వం అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా పాటించాల్సిన ప్రాథమిక విలువ అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. పలువురు ఫ్రెంచ్ రాజకీయ నాయకులు కూడా మహిళా సిబ్బందిని వారి లింగం కారణంగా పక్కన పెట్టడం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. అలాగే ఈ ఘటనపై బీఏపీఎస్ ప్యారిస్ దేవాలయం కూడా స్పందించింది.
ఈ పరిస్థితి వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా, బాధపడినా హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నామని ప్రకటించింది. ఈ అంశంపై వ్యక్తమైన ఆందోళనలను తాము చాలా సీరియస్గా తీసుకుంటున్నామని, పరస్పర గౌరవానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మహిళలు నేడు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు పురుషులకే పరిమితమని భావించిన అనేక రంగాల్లోకి మహిళలు ప్రవేశించడమే కాకుండా.. నాయకత్వ స్థానాలను కూడా చేపడుతున్నారు. రాజకీయాలు, సైన్యం, పోలీసు వ్యవస్థ, శాస్త్ర సాంకేతిక రంగాలు, క్రీడలు, వ్యాపారం, అంతరిక్ష పరిశోధన.. ఇలా ప్రతి రంగంలోనూ మహిళల విజయాలు కనిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మహిళలను కేవలం వారి లింగం ఆధారంగా వెనక్కి నెట్టడం లేదా ఒక ప్రదేశంలో వారు కనిపించకూడదనే పరిస్థితిని కల్పించడం వంటి ఆరోపణలు సహజంగానే తీవ్ర చర్చకు దారితీస్తాయి. ఒక వ్యక్తి లేదా ఒక బృందం తమ మతపరమైన, సాంస్కృతిక విశ్వాసాలను పాటించే హక్కును గౌరవించాల్సిందే. అదే సమయంలో.. ఆ విశ్వాసాలను గౌరవించే క్రమంలో ఉద్యోగుల ప్రాథమిక హక్కులు, వృత్తిపరమైన గౌరవం, లింగ సమానత్వం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.
ఇక పారిస్లోని ఈఫిల్ టవర్ ఘటనపై విచారణ తర్వాత పూర్తి వాస్తవాలు బయటకు రావాల్సి ఉన్నప్పటికీ.. మహిళా సమానత్వం, మత స్వేచ్ఛ, వ్యక్తిగత విశ్వాసాలు, వృత్తిపరమైన హక్కుల మధ్య సమతుల్యత వంటి అంశాలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరతీసింది..












