Mohan Bhagwat: జెన్ జీని (Gen-Z) ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరసన చేసే జెన్ జీ దేశ ద్రోహులు కాదన్నారు. వారే మన దేశ భవిత అని చెప్పారు. వారి ఆవేదన నిజమైనదే అని అన్నారు. ప్రస్తుత తరం కంటే జెన్ Z, జెన్ ఆల్ఫా నిజాయితీ కలవారు అనేది తన భావన అన్నారు. పెద్దలను ప్రశ్నించని ఇంతకుముందు తరంలా కాకుండా నేటి జెన్ జీ లాజికల్ ఆన్సర్స్ కోరుతున్నారని మోహన్ భగవత్ అన్నారు. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తూ వారితో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.
నీట్ (NEET) పరీక్షా పత్రం లీక్ వ్యవహారంపై యువత చేపట్టిన ఆందోళనలపై మోహన్ భగవత్ స్పందించారు. ఆందోళనకారులైన విద్యార్థుల అభ్యంతరాలు సమంజసమైనవేనని పేర్కొన్నారు. యువ ఆందోళనకారులను 'దేశ వ్యతిరేకులు'గా ముద్ర వేసే ప్రయత్నాలను ఆయన తోసిపుచ్చారు. దేశ భవిష్యత్ తరమైన యువతతో చర్చలు జరపడం అవసరమని స్పష్టం చేశారు.
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. "జెన్-జెడ్ (Gen Z) తరం వారు నిరసనలు చేస్తున్నంత మాత్రాన వారు దేశ వ్యతిరేకులు కారు. వారు మన వారే, మన తదుపరి తరం వారు. వారితో మాట్లాడాలి. అలాగే మనమంతా ఒకటే అనే భావన అవసరం. ఒకరితో ఒకరికి సంబంధం ఉండాలి. ఆ సంబంధాన్ని గుర్తించడం చాలా ముఖ్యం" అని భగవత్ అన్నారు. నిరసనకారుల ఆవేదనను భగవత్ సమర్థించారు. "ఏది ఏమైనప్పటికీ, వారి ఆవేదనలో నిజం ఉంది. భారతీయ విద్యావ్యవస్థలో ఇంకా చాలా చేయాల్సి ఉంది. అది జరగకపోవడం వల్లే దీనిపై చర్చ జరుగుతోంది" అని వ్యాఖ్యానించారు.
ఇతర మార్గాలు విఫలమైనప్పుడు, నిరసనను ఒక సమంజసమైన ప్రజాస్వామ్య సాధనంగా భగవత్ అభివర్ణించారు. "నిరసన అనేది కూడా ఒక రకమైన సంభాషణే. మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం. విషయాలు ఈ విధంగా అర్థమైతే మంచిదే. లేదంటే, మన మధ్య డిబేట్ జరుగుతుంది. మీకు గానీ, నాకు గానీ ఏదైనా సమస్య ఉండి, దాని పరిష్కారం మన చేతుల్లోనే ఉండి కూడా అది జరగకపోతే, అప్పుడు నేను గట్టిగా గళమెత్తుతాను," అని ఆయన అన్నారు. అధికారాన్ని ప్రశ్నించే ధోరణి ప్రపంచంతో వ్యవహరించే విధానంలో ఒక భిన్నమైన మార్పు అని పేర్కొన్నారు. నేటి యువతకు తన తరం వారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే అని భగవత్ వివరించారు.
"మేము జెన్ జెడ్ (Gen Z) తరంలో ఉన్నప్పుడు, పెద్దలు చెప్పిన దాన్ని అంగీకరించే వాళ్లం. ప్రశ్నించే వాళ్లం కాదు. ఇప్పుడు జెన్ జెడ్, జెన్ ఆల్ఫా అలా కాదు. వాళ్లు ప్రశ్నిస్తారు. వారికి తార్కిక (లాజికల్) సమాధానాలు కావాలి. ఈ కొత్త తరం, జెన్ జెడ్, జెన్ ఆల్ఫా మన ప్రస్తుత తరం కంటే ఎక్కువ నిజాయితీపరులు" అని మోహన్ భగవత్ అన్నారు.












