టాప్ న్యూస్

Elnino Effect: ఎల్‌నినో సెగ.. భారీగా పెరగనున్న ధరలు!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

దేశాన్ని వణికిస్తున్న ఎల్‌నినో ప్రభావం కేవలం నీటి కొరతకే పరిమితం కాకుండా, ప్రజలను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగే అవకాశముందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్ హెచ్చరించింది.

 దేశాన్ని వణికిస్తున్న ఎల్‌నినో ప్రభావం కేవలం నీటి కొరతకే పరిమితం కాకుండా, ప్రజలను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగే అవకాశముందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్ హెచ్చరించింది. ఎల్‌నినో తీవ్రత వల్ల ఈ ఏడాది దేశంలో సగటు వర్షపాతం ఏకంగా మైనస్ 10.65 శాతానికి పడిపోతుందని సదరు సంస్థ అంచనా వేసింది. దీనివల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయి మార్కెట్లో నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది.

 ఊహించని స్థాయికి విద్యుత్ వినియోగం..

మరోవైపు వర్షాలు లేకపోవడం, ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్ వినియోగం ఊహించని స్థాయికి చేరుకుంది. ఉక్కపోతను తట్టుకోవడానికి ప్రజలు ఏసీలు, కూలర్లను ఎక్కువగా వాడుతుండటంతో కరెంట్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫలితంగా రాబోయే రోజుల్లో ప్రజలు చెల్లించే విద్యుత్ బిల్లులు భారీగా పెరిగి తడిసి మోపెడవ్వనున్నాయి. ఈ జల, విద్యుత్ సంక్షోభం ప్రభావం పారిశ్రామిక రంగంపైనా పడనుందని, ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బ్యాంకుల నుంచి లోన్లు దొరకడం కూడా రాబోయే రోజుల్లో మరింత కష్టతరం కానుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఈ ఎల్ నినో ప్రభావం ఉచిత విద్యుత్ పథకంపై తీవ్రంగా పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'గృహజ్యోతి' పథకం లబ్ధిదారులకు ఈ వాతావరణ మార్పులు పెద్ద షాక్ ఇచ్చాయి. సాధారణంగా వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కరెంట్ వినియోగం తగ్గాల్సి ఉండగా, ఈ ఏడాది ఎండలు, ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో గృహ వినియోగదారుల విద్యుత్ వాడకం ప్రభుత్వం నిర్దేశించిన 200 యూనిట్ల పరిమితిని దాటిపోతోంది. దీనివల్ల ఎంతో కాలంగా ఉచిత విద్యుత్ పొందుతున్న లక్షలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ పథకానికి అనర్హులుగా మారుతున్నారు.

 తాజా గణాంకాల ప్రకారం.. కేవలం జూన్ నెలలోనే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL) పరిధిలో దాదాపు 4 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకానికి దూరమయ్యారు. ఈ పరిధిలో మొత్తం 26.54 లక్షల మంది అర్హులు ఉండగా, కేవలం 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లులు అందాయి. మిగిలిన సర్కిళ్లలోనూ ఇదే విధంగా అనర్హతకు గురైన వారి సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. జూలై నెలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మరికొంత మంది లబ్ధిదారులు ఈ ఉచిత కరెంట్ పథకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

#el-nino-impact#weather-crisis#agricultural-loss#food-inflation#power-shortage#economic-slowdown
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి