ప్రపంచవ్యాప్తంగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణలు మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, చమురు ధరలపై, సాధారణ ప్రజల జీవితాలపై పడుతుంది.
యుద్ధం ప్రారంభం కావడానికి కేవలం క్షణాలే చాలు... కానీ దాని గాయాలు తరాల పాటు మానవాళిని వెంటాడుతాయి. ఈ నిజాన్ని మరచిన దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణ ఇప్పుడు కేవలం రెండు దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచ శాంతి, భద్రతలకు సవాల్గా మారి అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అయినా ఇవేవీ పట్టనట్టు ముందుకు సాగుతున్న అమెరికా.. ఇరాన్ లోని పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకొని ఆరో రోజు రాత్రి దాడులు చేసింది.
ఫలితంగా ఇరాన్ లోని పలు నగరాల్లో కీలక మార్గాలు దాదాపు మూసుకుపోయాయి. అమెరికా బాంబుల వర్షాన్ని ఇరాన్ దక్షిణ ప్రాంతంలో దీవులు, నగరాలపై కురిపించింది. ఈ దాడిలో బందర్ ఈ ఖమీర్లో రెండు వంతెనలు ధ్వంసమయ్యాయి. హర్మూజ్ ప్రావిన్స్లో రోడ్డు రైల్వే నెట్వర్క్ టార్గెట్ గా అగ్రరాజ్యం రెచ్చిపోయింది. ఇరాన్షహర్లో ఎయిర్పోర్టుపై దాడి చేసింది.
అమెరికా వైమానిక దాడుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తీవ్రంగా దెబ్బతింది. కిష్ ద్వీపంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోగా, అమెరికా దాడుల్లో ముగ్గురు మృతి చెందినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. అలాగే చాబహార్లోని మారిటైమ్ కంట్రోల్ టవర్పై అమెరికా మూడోసారి దాడి చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం తమ సైనిక చర్యలు ముగిశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ ఆపరేషన్లో ఫైటర్ జెట్లు, డ్రోన్లు, యుద్ధ నౌకలను వినియోగించినట్లు తెలిపింది. ఇరాన్ రక్షణ, లాజిస్టిక్స్, నిఘా, సముద్ర భద్రతా సామర్థ్యాలకు గట్టి దెబ్బ కొట్టినట్లు పేర్కొంది. పశ్చిమాసియా ప్రాంతంలో ప్రస్తుతం సుమారు 50 వేల మంది అమెరికా సైనిక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
మరోవైపు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఖతార్, బహ్రెయిన్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగినట్లు సమాచారం. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యాయి.












