ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న తీవ్ర మార్పుల వల్ల గత 150 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొంటున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం (ఎల్నినో) వల్ల నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గి, దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాబోయే మార్చి, ఏప్రిల్ నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కురిసే స్వల్ప వర్షాలు కేవలం మెట్ట పంటలకు మాత్రమే ఉపయోగపడతాయని మంత్రి స్పష్టం చేశారు. నీటి లభ్యత చాలా తక్కువగా ఉన్నందున రైతులు వరి సాగు జోలికి వెళ్లకుండా, తక్కువ నీటితో వేగంగా చేతికి వచ్చే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ కమిటీల పనితీరు, నిర్వహణను పర్యవేక్షించేందుకు ఆరు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాలు వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు.
ఆపద సమయంలో రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వాతావరణానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం ద్వారా నష్టాల నుంచి గట్టెక్కవచ్చని సూచించారు.












