సాధారణ కుటుంబ నేపథ్యం, ఆర్థిక ఇబ్బందులు ఏవీ అతడి ఆశయానికి అడ్డుగోడ కాలేదు. పట్టుదలే పెట్టుబడిగా శ్రమించిన ఓ గ్రామీణ ప్రాంత విద్యార్థి, ఏకంగా కోటి రూపాయలకు పైగా వార్షిక వేతనంతో కెనడా కంపెనీలో అత్యున్నత కొలువు సాధించాడు. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గానికి చెందిన మాల్తి అఖిలేశ్ అనే యువకుడు రూ.1.06 కోట్ల ప్యాకేజీని అందుకుని తన ప్రతిభతో తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించాడు.
అఖిలేశ్ కుటుంబ నేపథ్యం అత్యంత సాధారణమైనది. అతడి తండ్రి గంగాధరరావు దివ్యాంగుడు (చెవిటి, మూగ). కష్టపడి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి కూడా భర్తకు తోడుగా అదే పనిలో సాయపడుతున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని, వారి త్యాగాలను కళ్లారా చూసిన అఖిలేశ్.. విద్యను మాత్రమే తన జీవితాన్ని మార్చే ఆయుధంగా మలచుకున్నాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా క్రమశిక్షణతో చదువుకుని ముందడుగు వేశాడు.
వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలోనే ఉద్యోగ బాధ్యతలు
సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో డేటా సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అఖిలేశ్, ఇటీవల నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కెనడాకు చెందిన 'క్వాంట్రైస్ టెక్ ఏఐ' అనే దిగ్గజ సంస్థ అతడిని ‘ఏఐ ఇంజినీర్’గా ఎంపిక చేసుకుని ఏటా రూ.1.06 కోట్ల భారీ వేతనాన్ని ఆఫర్ చేసింది. వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలోనే ఈ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సి ఉండటంతో, అతడు ఇప్పటికే స్వగ్రామం నుంచే విధుల్లో చేరాడు. ఇదే యూనివర్సిటీకి చెందిన రాజేశ్ అనే మరో విద్యార్థి కూడా సరిగ్గా ఇదే ప్యాకేజీ సాధించడం విశేషం.
మొదటి సంవత్సరం నుంచే ప్రాక్టికల్ శిక్షణ, పక్కా ప్రణాళికతో బోధన అందించడం వల్లే తమ విద్యార్థులు ఈ స్థాయి అవకాశాలను అందుకోగలిగారని యూనివర్సిటీ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. పేదరికాన్ని జయించి, వికలాంగుడైన తండ్రి కలలను నిజం చేస్తూ అత్యున్నత స్థాయికి ఎదిగిన అఖిలేశ్పై ప్రస్తుతం సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడే తత్వం ఉంటే ఏదీ అసాధ్యం కాదని అతడి విజయం మరోసారి నిరూపించింది.












