తెలంగాణ

Dharmapuri: ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. రూ.10 కోట్లతో ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణం!..

రచన: Venu4 నిమిషాల పఠనం

వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉగ్ర నరసింహస్వామి ఆలయానికి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విస్తరించడం జరుగుతుందని మరో వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృధి చేస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు.

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధికి అడుగులు పడ్డాయి.. నేటి సోమవారం వేకువజామున 2:58 గంటలకు వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో రూ. 10 కోట్లతో చేపట్టిన శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు.‎

అనంతరం ఆలయంలోని శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి, శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి మంత్రోచ్ఛారణలతో వేదాశీర్వచనంతో పాటు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం.. తెలంగాణలోని ప్రసిద్ధ నవనరసింహ క్షేత్రాల్లో ఒకటని, గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించడంతో 'దక్షిణకాశీ', 'తీర్థరాజం', 'హరిహర క్షేత్రం'గా ప్రసిద్ధి చెందిందని తెలిపారు.

వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉగ్ర నరసింహస్వామి ఆలయానికి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విస్తరించడం జరుగుతుందని మరో వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృధి చేస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు. గత ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్పిందని.. కానీ ప్రజా ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధికి రూ. 117 కోట్లు ఇదివరకే మంజూరు చేసిందని తెలిపారు.

అయితే స్థానిక శాసనసభ్యులు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం అదనంగా నిధులు కోరగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మరో రూ. 80 కోట్లను సాంక్షన్ చేశామని పేర్కొన్నారు. ఇక మొత్తం రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో ధర్మపురి క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా మార్చబోతున్నట్టు భట్టి తెలిపారు..

మరోవైపు బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా గోదావరి నది వెంట ఉన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఈమేరకు రూ. 10 కోట్లతో శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణం.. ‎​రూ. 58.55 కోట్లతో మొత్తం 9 రకాల మౌలిక వసతులు, ఆలయాభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన... రూ. 22.16 కోట్లతో నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం.‎​.. రూ. 2.48 కోట్లతో ధర్మపురి మండలం తిమ్మపూర్ వద్ద నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపనతో అభివృద్ధి పనులు జరగనున్నాయి..

#Dharmapuri#Ugra Narasimha Swamy#temple#development#cost 10 crore#Adluri Lakshman Kumar#Bhatti Vikramarka
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి