అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. నల్ల దుస్తులు ధరించి లోపలికి రాకూడదని పోలీసులు అడ్డుచెప్పడంతో బీఆర్ఎస్ శాసనసభ్యులు భగ్గుమన్నారు. నల్లదుస్తులు ధరించి రాకూడదని ఎవరూ చెప్పారంటూ పోలీసుల మీద ఫైర్ అయ్యారు.సమావేశాలు ప్రారంభానికి ముందు గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.
అనంతరం గన్ పార్క్ నుంచి కాలినడకన సమావేశాలకు హాజరయ్యేందుకు అసెంబ్లీ ప్రధాన గేటు వద్దకు వచ్చారు. అయితే,నల్ల దుస్తులు ధరించారనే కారణంతో పోలీసులు బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నారు.దీంతో అక్కడ పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది.వారిని తోసుకుని అసెంబ్లీలోకి వెళ్లాలని బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నించగా.. తోపులాట నెలకొంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు టీ షర్టు విప్పేసి అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు.

టీషర్ట్ విప్పి బనియన్తో అసెంబ్లీ గేటు ముందు హరీష్ రావు, అనిల్ జాదవ్ నిరసన వ్యక్తం చేశారు.బనియన్తోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు హరీశ్ రావు ప్రయత్నించగా.. అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు ముందు హరీశ్ రావును అరెస్టు చేసేక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కాసేపు తోపులాట కూడా జరిగింది. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్ను సైతం పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసింది.
https://x.com/TeluguScribe/status/2096825463796854975?s=20
ప్లకార్డులు, నల్లదుస్తులు ధరించి లోపలికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు తెలపడంతో అసెంబ్లీ మెయిన్ గేట్ వద్దే బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలిపారు.దీంతో బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదిలాఉండగా,అసెంబ్లీ సమావేశాలను 30 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్, 15 రోజులు జరపాలనని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు లేకుండా.. అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు, బీజేపీ సభ్యులతోనే సమావేశాలు కొనసాగుతున్నట్టు సమాచారం.












