కాంగ్రెస్ ప్రభుత్వానికి మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఒక్కరోజు కూడా సీఎం కుర్చీలో కూర్చోలేరని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేండ్ల అవినీతికి సంబంధించిన పూర్తి చిట్టా తమ వద్ద ఉందని పేర్కొన్నారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అసలు ఏం జరిగిందో, అక్కడ చోటుచేసుకున్న అల్లర్లకు బాధ్యులు ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.లోక్సభ ప్రతిపక్స నేత రాహుల్ గాంధీ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొచ్చారని ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని ఎంపీ డీకే అరుణ హితవు పలికారు.
రాహుల్ మెప్పు పొందడం కోసం పనిచేయడం వెంటనే ఆపేసి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, వారి సంక్షేమం కోసం పనిచేయాలని డీకే అరుణ సూచనలు చేశారు.కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు.సీఎం రేవంత్ ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, డీకే అరుణ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు కౌంటర్లు ఇవ్వడం మొదలెట్టారు.












