ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తిరిగి వచ్చారు. నిన్న పలువురు కేంద్రమంత్రులను కలిసిన సీఎం.. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల గురించి విజ్ఞప్తి చేశారు. ముందుగా కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిని కలిసిన సీఎం.. ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాల్లో పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ అనుమతులు కోరారు.అదే విధంగా హైదరాబాద్ టు బందర్ పోర్ట్కు గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఇప్పుడున్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా మరొకటి అడిగారు.
ఇక కేంద్రవిమానయానశాఖమంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి ఆదిలాబాద్, వరంగల్ ఎయిర్ పోర్టులను త్వరగా అభివృద్ధి చేయాలని 2028లో ప్రారంభించేలా చూడాలని కోరారు. దీనికి తోడు హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీలో సీ ప్లేన్స్ నడపడానికి సాధ్యసాధ్యాలను పరిశీలించాలని కోరగా.. అందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని నేటి ఉదయం హైదరాబాద్కు చేరుకున్న సీఎం.. ఫ్యూచర్ సిటీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు రామకృష్ణా రావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.












