Pawan Kalyan: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ రాశారు. పోక్సో చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయాలని సీఎం రేవంత్ ను కోరారు పవన్ కల్యాణ్. పోక్సో కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, కేసుల విచారణకు నిర్దిష్ట కాలపరిమితి విధించాలని పవన్ తన లేఖలో సూచించారు. పోక్సో ఘటనల్లో ప్రాధమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయాలన్నారు. చిన్నారుల భద్రత రాజ్యాంగ బాధ్యత అని స్పష్టం చేశారాయన.
ఆర్టికల్ 21, 39 ప్రకారం చిన్నారుల హక్కులు పరిరక్షించాలని సీఎం రేవంత్ కు రాసిన లేఖలో పవన్ కల్యాణ్ తెలిపారు. బాధితులకు పటిష్ట రక్షణ కల్పించాలని, నిందితుల బెయిల్ను వ్యతిరేకించాలని సీఎం రేవంత్ కు రాసిన లేఖలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. పోక్సో కేసుల్లో తక్షణ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లేఖలో పేర్కొన్నారు పవన్ కల్యాణ్. ఈ మేరకు 5 పేజీల లేఖ రాశారు పవన్ కల్యాణ్.
పోక్సో కేసుల దర్యాఫ్తును 60 నుంచి 90 రోజుల్లోగా పూర్తి చేసి చార్జ్ షీటు దాఖలు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఈ అంశంలో తీసుకున్న చర్యలపై 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు పవన్ కల్యాణ్. ఇక పోక్సో చట్టం అమలుపై ఏపీ సీఎస్, డీజీపీలకు కూడా లేఖ రాశారు పవన్ కల్యాణ్.
పోక్సో కేసుల్లో విచారణ వేగంగా జరగాలి, బాధితులకు రక్షణ ఉండాలి, బెయిల్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి, నిందితులపై నిరంతర నిఘా ఉండాలి అంటూ కీలక సూచనలు చేశారు పవన్ కల్యాణ్. ఇటీవల షాబాద్ లో రాజ్ కుమార్ ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. షాబాద్ ఘటనను ఆధారంగా చేసుకుని పోక్స్ చట్టం అమలు విషయంలో పవన్ కల్యాణ్ అనేక కీలక సూచనలు చేసినట్లుగా అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలనకు సంబంధించిన సంస్కరణలపై దృష్టి పెట్టాలనే కోణంలో పవన్ ఒక ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది.












