Indian Muslim Attacked: అమెరికాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భారతీయుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. నువ్వు ముస్లిమా? అని ఆ వ్యక్తి అడిగాడు. అవును అని అతడు చెప్పగానే రెచ్చిపోయాడు. కత్తితో దాడికి తెగబడ్డాడు. 15సార్లు పొడిచాడు.
ఉటాలోని ఒక షాపింగ్ మాల్లో ఈ ఘోరం జరిగింది. భారత్ కు చెందిన సొహైల్ ను లార్సెన్ అనే వ్యక్తి మతం గురించి అడిగాడు. నీ మతం ఏంటో చెప్పాలని అడిగాడు. అతడు ముస్లిం అని చెప్పగానే.. దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సొహైల్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. సదరు వ్యక్తి ముస్లిమా కాదా అని అడిగిన నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. మతం కారణంగానే అతడిని లక్ష్యంగా చేసుకున్నానని నిందితుడు అంగీకరించాడు. పోలీసులు లార్సెన్ ను అరెస్ట్ చేశారు. అతడు ముస్లిం కాబట్టే పొడిచానని పోలీసుల విచారణలో నిందితుడు చెప్పాడు. "ముస్లింలను చంపాలనే ఉద్దేశం" తనకు ఉందని అతడు ప్రకటించాడని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు ఆ మతస్తులందరినీ చంపేస్తానని నిందితుడు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
''వెస్ట్ వ్యాలీ సిటీలోని వ్యాలీ ఫెయిర్ మాల్లో ఈ దాడి జరిగింది. బాధితుడు సోహైల్ కియోస్క్లో పనిచేస్తున్నాడు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, దాడి చేసిన వ్యక్తి మొదట సోహైల్ను నువ్వు ఎక్కడివాడివి అని అడిగాడు. ఆ తర్వాత అతని మతం గురించి ప్రశ్నించాడు. నేను భారత్ నుండి వచ్చాను, నా పేరు సోహైల్ అని అతను చెప్పాడు. 'మీరు ముస్లిమా?' అని లార్సెన్ అడగగా, సోహైల్ 'అవును' అని చెప్పాడు. అంటే, వెంటనే అతను సోహైల్ను కత్తితో పొడవటం మొదలుపెట్టాడు" అని సమీపంలోని ఒక ఆభరణాల దుకాణంలో పనిచేసే లూనా నునెజ్ తెలిపారు.
నిందితుడిని 48 ఏళ్ల పీటర్ మైఖేల్ లార్సెన్గా పోలీసులు గుర్తించారు. హత్యాయత్నం, ప్రమాదకర ప్రవర్తన కేసుల కింద అతడిని అదుపులోకి తీసుకుని లేక్ కౌంటీ జైల్లో బంధించారు. ఈ దాడి ఘటనతో స్థానికంగా ఉంటున్న భారతీయులు ఉలిక్కిపడ్డారు. తమ భద్రత గురించి వారంతా ఆందోళన చెందుతున్నారు.
కాగా, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులు జరిగాయి. 2023లో ఇల్లినాయిస్లో ఆరేళ్ల ముస్లిం బాలుడు కత్తిపోట్లకు గురై మరణించాడు. కొన్ని రోజుల క్రితం శాన్ డియాగోలోని ఒక మసీదులో జరిగిన కాల్పుల ఘటనలో ఐదుగురు చనిపోయారు.












