ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ధర్నాపై పోలీసులు, బలగాలు దాడులు చేశాయి. దానికి సంబంధించిన ఆ వీడియోలు చూసి కేంద్రానికి తగు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిరాకరించారని మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.సోషల్ మీడియాలోనూ దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగింది. చీఫ్ జస్టిస్ కేంద్రానికి పక్షపాతం వహించారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ ఆరోపణలపై స్పందిచారు. తనపై ప్రసారం అయిన తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో అసలు ఎలాంటి రిట్ పిటిషన్ దాఖలు కాకుండానే, సీజేఐ విచారణను తోసిపుచ్చారని, ప్రసార సాధనాల్లో తప్పుడు కథనాలు రాయడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టు వేదికగానే ఆయన ఈ కామెంట్స్ చేయడం గమనార్హం.
‘గడిచిన రెండు రోజుల్లో ఒక పిటిషన్ దాఖలైందని, దాన్ని విచారించడానికి చీఫ్ జస్టిస్ నిరాకరించారని జాతీయ మీడియా అత్యంత బాధ్యతారాహిత్యంగా కథనాలు ప్రసారం చేసింది. ఉదయం 10 గంటల వరకు సుప్రీంకోర్టులో ఢిల్లీ నిరసనల అంశంపై ఒక్క పేజీ పిటిషన్ కూడా దాఖలు కాలేదు. ఎవరో మిశ్రా అనే న్యాయవాది పంపిన ఒక సాధారణ విజ్ఞప్తి/లేఖ మాత్రమే ఉంది.ఒక లేఖను నేను రిట్ పిటిషన్గా ఎలా పరిగణించగలను? అసలు నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి బాధ్యతారాహిత్యమైన కథనాలు ప్రసారం చేయడం సరికాదు’ అని ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టుపై ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మి కథనాలు రాయవద్దని, బాధ్యతాయుతమైన వార్తా సేకరణ ఉండాలని నేషనల్ మీడియాకు చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా హితవు పలికారు.












