ఏసీబీ అధికారులు అవినీతి తిమింగలాలకు వరుసగా షాకులు ఇస్తున్నా.. కొంతమంది అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకి చిక్కింది. చేర్యాల మండల ఎమ్మార్వో దిలీప్ నాయక్ రూ.70 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఒక వ్యక్తి భూ సంబంధిత పని చేసిపెట్టేందుకు.. ఎమ్మార్వో రూ.70 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు ధైర్యం చేసి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం లంచం తీసుకుంటున్న ఎమ్మార్వో ను రెడ్హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు.
నగదును స్వాధీనం చేసుకున్న అనంతరం అధికారులు.. చేర్యాల ఎమ్మార్వో కార్యాలయంలో సుదీర్ఘంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలు పరిశీలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వారు వెల్లడించారు.
మరోవైపు ఇలాంటి అవినీతి అధికారుల కారణంగా వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం రోజురోజుకూ దెబ్బతింటోంది. లంచం అనే ఈ వైరస్ కు చెక్ పెట్టి, పారదర్శక పాలనను తీసుకురావాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు... ప్రతి పౌరుడిదీ కూడా!












