ఏపీ సీఎం చంద్రబాబు మెగా ప్లాన్
త్వరలో చిరంజీవికి కీలక బాధ్యతలు
సోషల్ మీడియాలో వైరల్గా న్యూస్
చిరు పొలిటికల్ ఎంట్రీ నిజమేనా..?
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు. రాజకీయంగా ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోకపోయినా.. సినిమాల్లో మాత్రం మెగాస్టారే. అందుకే ఆ క్రేజీని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందట. ఇప్పుడీ వార్త రాజకీయా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. సీఎం చంద్రబాబుకు వచ్చిన ఓ ఆలోచనను డిప్యూటీ సీఎం పవన్ ముందు పెట్టారట. ఆయన కూడా ఓకే చెప్పడంతో చిరంజీవితోనూ మాట్లాడరనే ప్రచారం జరుగుతోంది.
చిరంజీవికి ఇస్తున్న ఆఫర్ ఏంటి..?
చిరంజీవి సేవలను వాడుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందనేదే ఈ వార్తల సారాంశం. ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకు మధ్య వారధిగా మెగాస్టార్ సేవలను వాడుకోనుందట ప్రభుత్వం. ఈ మధ్య చంద్రబాబుతో చిరంజీవి భేటీ కావడానికి కూడా కారణం ఇదేనట. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాలను ప్రజలకు చేరవేయడమే చిరంజీవికి అప్పగిస్తున్న బాధ్యత అని తెలుస్తోంది. అంటే అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏపీ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవిని చూసే అవకాశముంది. ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.
ఏపీ సీఎంకు ఈ ఆలోచన రాగానే.. డిప్యూటీ సీఎం పవన్తో చర్చించారట. ఆయన కూడా ఓకే చెప్పడంతో చిరంజీవి ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలో సత్తా చాటారు చిరంజీవి. పార్టీ అధికారంలోకి రాకపోయినా.. జనాల్లో మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్బై చెప్పి మళ్లీ స్క్రీన్పై మెరిశారు. వైసీపీ హయాంలో కూడా ఇలాంటి ఆఫర్లు వస్తే చిరంజీవి తిరస్కరించారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఓ దశలో బీజేపీ కూడా రాజ్యసభ ఆఫర్ చేసిందని, దానికి కూడా నో చెప్పారని వార్తలు వచ్చాయి. తాజాగా మాత్రం ఏపీ ప్రతిపాదనను కాదనలేక పోయారట.
తమ్ముడు డిప్యూటీ సీఎం.. అన్న బ్రాండ్ అంబాసిడర్
సోదరుడు పవన్కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండడంతో.. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనపై చిరంజీవి ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించేందుకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజీగా ఉండడంతో, కొద్ది రోజుల తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించే అవకాశముందట.
గతంలో టీడీపీతో అంటీ ముట్టనట్టుగానే ఉండేవారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాతే రాజకీయాలకు గుడ్బై చెప్పారు. కానీ ఇప్పుడు తన సోదరుడు కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా కూటమి పార్టీలతో సఖ్యతగానే మెలుగుతున్నారు. ఈ క్షణం వరకు క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఒకవేళ బ్రాండ్ అంబాసిడర్గా బాధ్యతలు స్వీకరించినా.. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం మాత్రం లేదని తెలుస్తోంది. కేవలం ప్రజలకు.. ప్రభుత్వానికి వారధిగా ఉండడానికే పరిమితం కావచ్చు.
ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో తెలియదు కానీ.. ఈ వార్త మాత్రం చిరంజీవి ఫ్యాన్స్కు ఫుల్ జోష్ ఇచ్చిందట. తమ అభిమాన నటుడు చాలా రోజుల తర్వాత మళ్లీ పొలిటికల్ వేదికలపైకి రాబోతున్నారని ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇది ప్రచారం మాత్రమే. కొద్ది రోజుల్లోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.












