హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ పెడ్లర్లు రెచ్చిపోతున్నారు. అమాయక యువతే లక్ష్యంగా కాలేజీలు, మాల్స్, సినిమా హాల్స్ కేంద్రంగా గుట్టుగా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్నారు. యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు. అడ్డుకోబోయిన పోలీసులపైనే దాడులకు దిగుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనపై నగరంలోని రద్దీ ప్రాంతమైన అబిడ్స్లో చోటుచేసుకుంది.
నిన్న మధ్యాహ్నం అబిడ్స్లో డ్రగ్స్ కొనుగోలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఆ ప్రాంతంలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్స్ పెడ్లర్ కారులో అబిడ్స్లోని పాయల్ ఫుట్వేర్ వద్దకు వచ్చి సరఫరా చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.కారు పక్కకు తీస్తున్నట్లు నటించి పోలీసులపైకి ఎక్కించగా..కానిస్టేబుల్ మహేందర్కు కాలు ఫ్రాక్చర్.. పరారైన డ్రగ్స్ పెడ్లర్ను చేజ్ చేసి అఫ్జల్గంజ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదే ఘటనలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మరో కానిస్టేబుల్ వంశీధర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. డ్రగ్స్ పెడ్లర్ను హుస్సేనీ ఆలంకు చెందిన సైఫ్గా పోలీసులు గుర్తించారు.కాలు ఫ్రాక్చర్ అయిన కానిస్టేబుల్ మహేందర్ను యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత కానిస్టేబుల్ మహేందర్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్పై అబిడ్స్, అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లలో అటెంప్ట్ టు మర్డర్ కేసులు నమోదయ్యాయి. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు తెలిసింది.












