తమిళ ప్రముఖ కథానాయకుడు ధనుష్ తన రాజకీయ అరంగేట్రంపై మరోసారి ఊహాగానాలకు బీజం వేశారు. అభిమానులు తమ బలమైన ఐక్యతను కేవలం సినిమా వేడుకలకే పరిమితం చేయకుండా, సమాజ శ్రేయస్సు, ప్రజా సేవ కోసం ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఇటీవల నిర్వహించిన ఒక వేడుకలో ఆయన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ.. ఒకేచోట వేలాదిగా సమకూరిన అభిమానుల ఐక్యతలో అపారమైన శక్తి ఉందన్నారు. ఆ శక్తికి సరైన ప్రయోజనం చేకూరాలంటే కేవలం ఆడియో ఫంక్షన్లు, ఫ్యాన్స్ మీట్లకే పరిమితం కాకుండా సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పేద కుటుంబాలకు తోచిన సాయం అందించి, తనను గర్వపడేలా చేయాలని ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్ కావడంతో, ‘దళపతి’ విజయ్ బాటలోనే ధనుష్ కూడా త్వరలోనే రాజకీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే వేడుకలో జాతీయ అవార్డుల చుట్టూ వచ్చిన విమర్శలపైనా ధనుష్ స్పందించారు. 2024లో తన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘రాయన్’ చిత్రం కంటే అద్భుతమైన తమిళ సినిమాలు ఆ ఏడాది వచ్చి ఉండవచ్చని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ, ఒకే ఏడాదిలో ఒక తమిళ నటుడికి రెండు జాతీయ స్థాయి పురస్కారాలు దక్కడం పరిశ్రమకే గొప్ప విషయమని, దాన్ని విమర్శించకుండా ప్రతీ ఒక్కరూ వేడుకలా జరుపుకోవాలని సూచించారు.
కాగా, ధనుష్ కథానాయకుడిగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ‘స్పెషల్ మెన్షన్’ పురస్కారం లభించగా, ఆయన దర్శకత్వం వహించి నటించిన ‘రాయన్’ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైన సంగతి విదితమే. ఒకవైపు సినిమాల్లో నటుడిగా, దర్శకుడిగా దూసుకుపోతూనే, మరోవైపు అభిమానులను సేవ బాట పట్టించడం ద్వారా ధనుష్ భవిష్యత్తు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.












