రాష్ట్రంలో ఓ వైపు పండుగ వాతావరణం కనిపిస్తుంటే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయివేట్ వాహనాల్లో వెళితే భద్రత ఉండదని భావించి టీజీఎస్ఆర్టీని నమ్ముకున్న ప్యాసింజర్స్ జేబులకు మాత్రం చిల్లు పడుతోంది. మొన్నటివరకు ఉన్న సాధారణ చార్జీల కంటే ఇవాళ ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్యాసింజర్స్ గగ్గోలు పెడుతున్నారు.ఎక్స్ప్రెస్ బస్సులకు ‘స్పెషల్’ అని బోర్డులు పెట్టి విపరీతంగా దోచేస్తున్నారని మండిపడుతున్నారు.
హిందూ పండుగలు వస్తే చాలు దోచేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మిగతా పండుగలకు ఇలా ఎందుకు వసూలు చేయడం లేదని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు గుప్పిస్తున్నారు.ఇదే విషయంపై గతంలో బీజేపీ సైతం ప్రభుత్వానికి, ఆర్టీసీ అధికారులు, సంబంధిత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రశ్నలు సంధించింది.అయినప్పటికీ సర్కారు తీరులో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది.కేవలం ధనార్జనే ధ్యేయంగా పండుగల టైంలో ప్యాసింజర్స్ను దోచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవాళ రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులో చార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్కు రూ. 290 టికెట్ చార్జ్ చేయగా.. రాఖీ రోజున రూ.400 వసూలు చేస్తున్నట్టు ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పండుగల పేరుతో ఆర్టీసీ ఇష్టానుసారంగా చార్జీలు పెంచుతున్నదని, దానికి సంబంధించిన టికెట్ ఫేర్, డ్రైవర్ వాయిస్ను వీడియో తీసి ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.
పండుగ రద్దీని ఆర్టీసీ క్యాష్ చేసుకుంటోందని నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. పండుగ పేరుతో 1:50 రూల్ పేరుతో అదనంగా 100 నుంచి 150 చార్జీలు ఆర్టీసీ వసూలు చేస్తున్నట్టు సమాచారం. స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కిన తర్వాత మార్గ మధ్యంలో ఆర్టీసీ కండక్టర్లు ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, దీనిపై ఆర్టీసీ అధికారులు ఇంకా స్పందించలేదు.












