National

నీట్‌తో మోదీకి యువత షాక్..? సీవోటర్ సర్వేలో సంచ‌ల‌న విష‌యాలు!

రచన: Kashi6 నిమిషాల పఠనం

సీవోటర్‌ విశ్లేషణలో అత్యంత కీలకంగా ప్రస్తావించిన అంశం యువతలో పెరుగుతున్న అసహనం. ఉద్యోగాల కోసం పోటీ, పరీక్షల్లో పారదర్శకతపై సందేహాలు, భవిష్యత్తుపై ఆందోళన... ఇవన్నీ కలిసి యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయని సర్వే పేర్కొంది.

మోదీ ప్ర‌భుత్వంపై యువ‌త మ‌దిలో ఏముంది..?

నీట్ ఇష్యూ త‌ర్వాత జెన్ జీ ఏమ‌నుకుంటున్నారు..?

సీవోట‌ర్ స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు

బీజేపీ జాగ్ర‌త్త పడాల్సిందేనంటున్న విశ్లేష‌కులు

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పేప‌ర్ లీక్ వివాదం రాజకీయంగానూ కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందా? తాజాగా వెలువడిన సీవోటర్‌ సర్వే అలాంటి సంకేతాలనే ఇస్తోంది. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తి, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు.. రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి సవాల్‌గా మారే అవకాశముందనే చర్చ మొదలైంది.

నీట్‌ వివాదం... ప్రజలు ఏమనుకుంటున్నారు..?

దేశవ్యాప్తంగా జూలై 29, 30 తేదీల్లో 18 ఏళ్లు దాటిన ఓటర్లతో సీవోటర్‌ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన తీరుపై సగానికి పైగా ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే వెల్లడించింది.

ఇందులో మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ప్రభుత్వ పనితీరును తప్పుబట్టిన వారిలో 40 శాతం మందికి పైగా ఎన్డీఏకు మద్దతు ఇచ్చే ఓటర్లే ఉన్నారని సర్వే చెబుతోంది. అంటే విమర్శలు కేవలం ప్రతిపక్షం నుంచి మాత్రమే కాకుండా, అధికార కూటమికి మద్దతిచ్చే వర్గాల నుంచీ వినిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విద్యార్థులపై లాఠీచార్జ్‌... ప్రజల స్పందన ఏంటి..?

నీట్‌ పరీక్షలో అవకతవకల ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

సీవోటర్‌ సర్వే ప్రకారం... విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని అధిక సంఖ్యలో ప్రజలు కోరుతున్నారు. అదే సమయంలో ఆందోళన పేరుతో హింసకు పాల్పడిన వారిపై మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అంటే ప్రజలు ఒకవైపు విద్యార్థుల హక్కులకు మద్దతు ఇస్తూనే, మరోవైపు హింసను సమర్థించడం లేదని ఈ సర్వే సూచిస్తోంది.

సీజేపీ డిమాండ్‌పై ప్రజల్లో భిన్న స్పంద‌న‌లు

నీట్‌ ఆందోళనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించాలంటూ సీజేపీ చేసిన డిమాండ్‌పై మాత్రం ప్రజల్లో ఏకాభిప్రాయం కనిపించలేదట‌. విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని కొంతమంది భావిస్తే... మరికొందరు చట్టం తన పని తాను చేసుకోవాలని అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. ఈ అంశంలో ప్రజాభిప్రాయం రెండు వైపులా చీలిపోయినట్లు సర్వే చెబుతోంది.

మోదీకే ఆధిక్యం..!

ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ... నాయకత్వ పరంగా మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికీ ప్రజల్లో గణనీయమైన ఆదరణ కొనసాగుతోందని సీవోటర్‌ తెలిపింది. సర్వే ప్రకారం... ప్రజాకర్షణలో మోదీ, విపక్ష నేత రాహుల్‌ గాంధీ కంటే 12 శాతం ముందంజలో ఉన్నారు. అంటే ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు ఉన్నా... వ్యక్తిగత నాయకుడిగా మోదీపై నమ్మకం ఇంకా పూర్తిగా తగ్గలేదనే సంకేతాలను ఈ ఫలితాలు ఇస్తున్నాయి.

ఎన్డీఏ ముందు అసలైన సవాల్

సీవోటర్‌ విశ్లేషణలో అత్యంత కీలకంగా ప్రస్తావించిన అంశం యువతలో పెరుగుతున్న అసహనం. ఉద్యోగాల కోసం పోటీ, పరీక్షల్లో పారదర్శకతపై సందేహాలు, భవిష్యత్తుపై ఆందోళన... ఇవన్నీ కలిసి యువతలో అసంతృప్తిని పెంచుతున్నాయని సర్వే పేర్కొంది.

లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ భవిష్యత్తును పోటీ పరీక్షలపైనే ఆధారపడి చూస్తున్నారు. అలాంటి సమయంలో పరీక్షల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తితే... అది కేవలం విద్యా వ్యవస్థ సమస్యగా కాకుండా రాజకీయ అంశంగానూ మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సర్వే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని ఒత్తిడి పెరుగుతుండగా... మరోవైపు ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.

#NEET Paper Leak#C-Voter Survey#NDA Government#Narendra Modi#Rahul Gandhi#NEET Protest#India Politics#Youth Opinion#Education News#Exam Controversy#BJP#Opposition#Students Protest#Indian Politics#Survey Report
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి