సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఎంతో ఘనంగా కొనసాగుతున్నాయి. నిన్న సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం రంగం కార్యక్రమం నిర్వహించారు.ఇందులో మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని చెప్పుకొచ్చారు. ఈ ఏడు బోనాల ఉత్సవాలతో సంతృప్తి చెందావా? అని ప్రధానార్చకులు ఆమెను ప్రశ్నించగా.. స్వర్ణలత సమాధానం చెప్పలేదు.
మీ సమాధానం కోసం కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారని అనగా.. అమ్మవారు పూనిన స్వర్ణలత బదులిస్తూ..‘నేను ఉత్సవాలకు సంతోషంతో రాలేదురా కోపంతో వచ్చాను. ఏటా మీరు పూజలు చేస్తున్నా.. అసంతృప్తితోనే సరిపెట్టుకుంటున్నా! ఏ ప్రమాదాలు వచ్చినా.. నా బిడ్డలను కాపాడుకుంటున్నా.. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట ఇచ్చారు. నేను చెప్పింది మాత్రం చేయడం లేదు’ అని స్వర్ణలత భవిష్యవాణి పలికింది.
అంతటితో ప్రధానార్చకులు సమాధానమిస్తూ ఆచరించడం లేదని కాదమ్మ.. వెసులుబాటు ఉండటం లేదని తెలిపారు. మరల మాతంగి స్వర్ణలత స్పందిస్తూ.. ‘విగ్రహ ప్రతిష్ఠకు ఎవరు అడ్డొచ్చినా.. ఊరుకోను!’ తెలిపింది. వర్షాలు, ఉపద్రవాల గురించి ప్రశ్నించగా.. ‘ఈ ఏడాది వర్షాలు కుంభవృష్టిగా కురుస్తాయి. జనం కొట్టుకుపోతారు. అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి’ అని సెలవిచ్చింది.
ఇక జనం వావివరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఊరిమీద వదిలేస్తున్నారని పలికింది. ‘నా పట్ల అహంకారం ఎక్కువైనా..ఈ ఏడు ఉత్సవాల విషయంలో నిరుత్సాహపరిచినా, మిమ్మల్ని కాపాడుతూనే ఉంటా’ అని కంటతడి పెట్టింది. భక్తులు దోశడంత ఇస్తే గోరంత కూడా నాకు పెట్టడం లేదు.రాబోయే 6 నెలల్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరక్కపోతే.. భారీగా ప్రాణనష్టం జరుగుతుంది. నా ఉగ్రరూపం చూస్తారు’ అని స్వర్ణలత హెచ్చరించింది.












