పార్లమెంట్ సమావేశాల వేళ అటు కాక్రోచ్ జనతా పార్టీ నేతలు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా గత కొంతకాలంగా సీజేపీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నది. దీనికి సోషల్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగుచుక్ సైతం తోడయ్యాడు. ఈ క్రమంలోనో సోనమ్ చేపట్టిన నిరహారదీక్ష, ఆయన్ను బలవంతంగా ఆస్పత్రికి తరలించడంతో పార్లమెంట్ మార్చ్కు సీజేపీ పిలుపునిచ్చింది. నిన్న విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలు చేపట్టిన చలో సంసద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీచార్చ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ సైతం ప్రయోగించగా పలువురు నిరసనకారులు, తోపులాటలో పోలీసులకు సైతం గాయాలయ్యాయి.
ఇదిలాఉండగా, భారత్ - అమెరికా ట్రేడ్ డీల్ను తీవ్రంగా నిరసిస్తూ పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాల రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. పంజాబ్లోని పాటియాలా నుంచి వేలాదిగా శంభూ బార్డర్కు చేరుకున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. దేశరాజధాని ఢిల్లీలోని'కిసాన్ ఘాట్' వద్ద నిర్వహించ తలపెట్టిన మహా పంచాయత్కు వెళ్లకుండా వంతెనలపై భారీ సీమెంట్ దిమ్మెలు, ముళ్లకంచెలతో కాంక్రీట్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటర్ కేనన్లతో పోలీసు దళాలను భారీగా మోహరించారు.
అమెరికాతో కుదిరే ట్రేడ్ డీల్ వలన చవకైన డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి దిగుమతి అయి, దేశీయ పశుపోషకులు, చిన్న తరహా రైతుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమను ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకోవడంపై రైతుసంఘాల నేతలు భగ్గుమన్నారు. ముందస్తు జాగ్రత్తగా ఢిల్లీ పోలీసులు సైతం సరిహద్దుల్లో భారీగా భద్రతను పెంచారు.ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే సీజేపీ నిరసనలతో జంతర్ మంతర్ ఉద్రిక్తంగా మారింది. దీనికి తోడు రైతుల నిరసనలు తోడైతే హింసాత్మకంగా మారే అవకాశం ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించినట్టు సమాచారం.












