ఆకాశమే హద్దుగా సత్తా చాటుతున్న నారీశక్తికి క్రికెట్ మైదానమూ మినహాయింపు కాదని భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ మరోసారి నిరూపించింది. సాంకేతిక రంగాలు, పాలన, అంతరిక్ష పరిశోధనల నుంచి క్రీడా ప్రపంచం వరకు ప్రతీ రంగంలోనూ పురుషులకు తీసిపోమని ప్రకటిస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న భారత మహిళా క్రికెట్ ఆల్రౌండర్ దీప్తి శర్మ అగ్రస్థానాన నిలిచింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
దుబాయ్ వేదికగా మహిళల ఆసియా కప్లో థాయ్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో అత్యద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్కు ముందు 168వికెట్లతో ఉన్న దీప్తి, థాయ్లాండ్ బౌలర్ తిపాచా పుత్తావోంగ్ (170 వికెట్లు) రికార్డును బద్దలు కొట్టేందుకు మూడు వికెట్ల దూరంలో నిలిచింది. తన కట్టుదిట్టమైన స్పెల్తో 9వ ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సమం చేసింది.
అంతేకాదు.. తర్వాతి ఓవర్ తొలి బంతికే నన్నపట్ కొంచరోయెంకాయ్ను అవుట్ చేసిన దీప్తి.. 171వ వికెట్తో ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బౌలర్గా చరిత్ర సృష్టించింది. ఈ పోరులో కేవలం 1.1ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా (0/3) మూడు వికెట్లు తీసి అరుదైన ఘనతను సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా ఆమె మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఆమె ధాటికి థాయ్లాండ్ కేవలం 65పరుగులకే కుప్పకూలడంతో భారత్ 94 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. కెరీర్లో 150వ టీ20 ఆడుతున్న మ్యాచ్లోనే ఈ చారిత్రక ఘనత సాధించడం విశేషం. ఈ మైలురాయిని అందుకున్న మూడో భారత మహిళా క్రికెటర్గా హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన సరసన దీప్తి చేరింది. ప్రస్తుతం టీ20ల్లో దీప్తి శర్మ (171) అగ్రస్థానంలో ఉండగా, తిపాచా పుత్తావోంగ్ (170), హెన్రియెట్ ఇషిమ్వే (164), సోఫీ ఎక్సెల్స్టోన్ (154) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.











