పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు
నెల రోజుల విరామం తర్వాత దాడులు
హోర్ముజ్ చుట్టే ఘర్షణలు
మిడిల్ఈస్ట్లో మళ్లీ యుద్ధ మంటలు ఎగిసిపడుతున్నాయి. కొన్ని వారాలుగా కాస్త ప్రశాంతంగా కనిపించిన అమెరికా–ఇరాన్ ఘర్షణ ఒక్కసారిగా మళ్లీ భగ్గుమంది. హోర్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా దాడులు చేయడం.. దానికి ప్రతిగా ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించడం.. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
అసలు ఈసారి అమెరికా టార్గెట్ చేసింది ఎక్కడ? ఇరాన్ ఎందుకు అంత వేగంగా ప్రతీకార దాడులకు దిగింది? ఈ ఘర్షణ మళ్లీ పెద్ద యుద్ధంగా మారితే ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
హోర్ముజ్ దగ్గర అమెరికా దాడి
ఆగస్టు 30న అమెరికా బలగాలు ఇరాన్లోని లారక్ దీవిపై ఉన్న రెండు రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ బలగాలు హోర్ముజ్ జలసంధిలో సీ.. మైన్స్ను ప్రయోగించే రాకెట్లను సిద్ధం చేస్తున్నట్లు గుర్తించిన తర్వాత ఈ దాడి జరిగింది.
ఇక్కడే అసలు విషయం ఉంది. లారక్ దీవి సాధారణమైన ప్రాంతం కాదు. ఇది హోర్ముజ్ జలసంధికి దగ్గరగా ఉంటుంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గాల్లో హోర్ముజ్ ఒకటి. కాబట్టి అక్కడ ఏ చిన్న సైనిక చర్య జరిగినా దాని ప్రభావం మిడిల్ఈస్ట్ను దాటి ప్రపంచ మార్కెట్లపై పడుతుంది.
ఇరాన్ రివెంజ్.. అమెరికా స్థావరాలపై క్షిపణులు
అమెరికా దాడికి ఇరాన్ వెంటనే ప్రతిస్పందించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకారం.. జోర్డాన్లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. అమెరికా బలగాలు దీనికి సంబంధించిన కొన్ని క్షిపణులను అడ్డుకున్నట్లు సమాచారం.
ఇప్పుడు పోరాటం ఇరాన్ భూభాగానికే పరిమితం కాలేదు. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలు కూడా టార్గెట్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్న అంశం.
మళ్లీ హోర్ముజ్పైనే ప్రపంచం చూపు
ఈ ఘర్షణలో అత్యంత కీలకమైన అంశం హోర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా సాగుతుంది. ఇప్పటికే భద్రతా భయాలతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు బాగా తగ్గాయి. ప్రస్తుతం హోర్ముజ్ మీదుగా ప్రయాణించిన కమోడిటీ నౌకల సంఖ్య రోజుకు ఐదుకు పడిపోయినట్లు షిప్పింగ్ డేటా సూచిస్తోంది.
ఈ దాడులతో మార్కెట్లు వెంటనే స్పందించాయి. అమెరికా దాడుల తర్వాత సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో 90 డాలర్లకు పైగా చేరింది. అంటే యుద్ధం తీవ్రత పెరిగితే చమురు ధరలు మరింత పైకి వెళ్లే అవకాశం ఉందన్న భయం ఇప్పటికే మార్కెట్లలో కనిపిస్తోంది.
యుద్ధం మళ్లీ పెద్దదవుతుందా?
ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. అమెరికా మాత్రం తన దాడిని పరిమితమైన, ఖచ్చితమైన సైనిక చర్యగా చెబుతోంది. హోర్ముజ్లో నౌకాయానానికి ముప్పు కలిగించే చర్యలను అడ్డుకోవడమే లక్ష్యమని వాషింగ్టన్ చెబుతోంది. మరోవైపు ఇరాన్ మాత్రం అమెరికా దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రతీకారం కొనసాగుతుందని హెచ్చరిస్తోంది.
దీంతో ఇప్పటికే ఆరు నెలలకు పైగా కొనసాగుతున్న మిడిల్ఈస్ట్ యుద్ధం మరో ప్రమాదకర దశలోకి వెళ్లినట్లవుతోంది. దౌత్యపరమైన ప్రయత్నాలు నిలిచిపోయిన సమయంలోనే ఈ తాజా దాడులు జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
భారత్పైనా ప్రభావం తప్పదా?
అమెరికా–ఇరాన్ ఘర్షణ పెరిగితే భారత్ కూడా దాని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, షిప్పింగ్ ఖర్చులు పెరగడం, దిగుమతి బిల్లు భారమవడం వంటి ప్రభావాలు కనిపించొచ్చు.
అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి ఒక్కటే.. అమెరికా–ఇరాన్ మధ్య ఈ తాజా దాడులు ఇక్కడితో ఆగుతాయా? లేక మళ్లీ మిడిల్ఈస్ట్ను పూర్తిస్థాయి యుద్ధంలోకి నెట్టేస్తాయా? ప్రస్తుతం అన్ని దేశాలను వేధిస్తున్న ప్రశ్నలివే.












